తెలంగాణ లో సొంత పార్టీ పెట్టుకుని వెళ్లిపోయిన వై ఎస్ షర్మిలకు, ఆమె సోదరుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు మధ్య తీవ్రమైన అగాధం ఏర్పడిందనే వార్తలు చాలా కాలంగా హల్ చల్ చేస్తున్నాయి. ఇవి నిజమని కొందరు, పచ్చ మీడియా చేస్తున్న పుకారని మరికొందరు అంటున్నారు. అయితే షర్మిలకు, జగన్ కు మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయనే విషయం ఇప్పటికే రెండు మూడు సార్లు రుజువు అయింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు షర్మిల తీవ్రంగా వ్యతిరేకించారు.
ఏపి తెలంగాణ మళ్లీ కలిపేస్తే తమకు అభ్యంతరం లేదని జగన్ కు అత్యంత సన్నిహితుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించిన ఉత్తరక్షణంలోనే షర్మిల ఆ ప్రకటనను తీవ్రంగా ఖండించారు. రాజకీయంగా ఇలా తరచూ అన్నా చెల్లెళ్ల మధ్య విభేదాలు బహిర్గతం అవుతున్న దశలో మరో కీలక సంఘటన చోటు చేసుకున్నది. గత కొద్ది రోజులుగా ఏపిలో పర్యటిస్తున్న షర్మిల భర్త, జగన్ బావ అయిన బ్రదర్ అనిల్ క్రిస్మస్ సభల్లో ప్రసంగిస్తున్నారు. ఓవైపు తన బావమరిది ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల పేరుతో మోత మోగిపోతున్న వేళ.. ఆయన ఆ పథకాలపై బ్రదర్ అనిల్ కీలక వ్యాఖ్యలు చేయటం గమనార్హం.
”తమ స్వార్థం కోసం ప్రభుత్వం ఇచ్చే పథకాలపై ప్రజలు ఆధారపడొద్దు” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఆయన నోటి నుంచి ఆసక్తికరమైన మాట వచ్చింది. ‘దేవుడి పథకాలు వేరుగా ఉంటాయి’ అంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. తాజాగా విశాఖ జిల్లా భీమిలి మండలంలో జరిగిన క్రిస్మస్ కార్యక్రమానికి హాజరైన ఆయన నోటి నుంచి కాస్త భిన్నమైన వ్యాఖ్యలు వచ్చాయి.
”ఈ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రాల్లో పుట్టినా బాగుండునే భావన ప్రజల్లో ఏర్పడింది” అన్న సంచలన వ్యాఖ్య బ్రదర్ అనిల్ కుమార్ నోటి నుంచి వచ్చాయి.ఎవరి పేరును ప్రస్తావించకుండా చేసిన ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గత ఏడాది ఇదే చోటుకు వచ్చిన సందర్భంలోనూ ఆయన ఇదే తరహాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏమైనా.. సీఎం జగన్ బావ నోటి నుంచి వచ్చిన మాటలు హాట్ టాపిక్ గా మారాయని చెప్పక తప్పదు.