దేశం చరిత్రలో విభజనవాదిగా పేరొందిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సారధ్యంలో ఏర్పడిన భారత రాష్ట్ర సమితి (బి ఆర్ఎస్) జాతీయ పార్టీకి భవిష్యత్తు ఉండబోదని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య అభిప్రాయపడ్డారు. బుధవారం తెలంగాణా సిఎం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన సందర్భంగా బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
కేసీఆర్ రాజకీయ మాంత్రికుడు అని, ఆయనకు తెలిసిన రాజకీయ తంత్రాలు మరొకరికి తెలియవని చెప్పారు. కెసీఆర్ తో కలిసి పని చేసేందుకు తెలంగాణ నాయకులు మాత్రమే ఉత్సాహం చూపుతారు తప్ప, దేశంలోని ఏ రాష్ట్ర నాయకులూ చూపరని పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో గడ్డి కూడా మొలవదని అన్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీని నమ్మించి, మోసం చేశారని, అందువలనే కాంగ్రెస్ ఉన్న రెండో ఫ్రంట్ తో జత కట్ట లేక ఏకంగా సొంత జాతీయ పార్టీని ఏర్పాటు చేశారని చెప్పారు.
తోటి తెలుగు ప్రజలపై భావోద్వేగాలు రెచ్చగొట్టి, రాజకీయ నిరుద్యోగం నుంచి విముక్తి పొందినట్లు తెలిపారు. ఆయనను నమ్మి ఉద్యమంలో రక్త మాంసాలు ధారపోసిన నాయకులను అడిగితే, కేసీఆర్ నైజం గూర్చి, దృతరాష్ట్రుని కౌగిలి గూర్చి పూర్తిగా తెలుస్తుందన్నారు. బిఆర్ఎస్ కి దేశంలో పునాది ఏర్పడితే, దేశాన్ని రెండు దేశాలుగా చేసి చూపిస్తారని,ఇందుకు కేసీఆర్ ఒక్కరే సమర్ధులని, 24 ఎన్నికల్లో బిజెపి కి విసనకర్ర లా ఉపయోగపడే అవకాశం ఉండొచ్చు అని బాలకోటయ్య అభిప్రాయ పడ్డారు.