దేశ అబ్బివృద్ది బీఆర్ఎస్ తోనే సాధ్యం అవుతుందని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్ రావు అన్నారు. బుధవారం టిఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించిన సందర్భంగా ప్రకటనకు మద్దతుగా కామారెడ్డి ఎమ్మేల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పిలుపు మేరకు కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద టీఆరెఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాల్ రావు ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి సంబరాలు నిర్వహించారు.
అనంతరం నిట్టు వేణుగోపాల్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు అది పెద్ద పండగ రోజు అయిన దసరా వేళ సీఎం కెసిఆర్ జాతీయ పార్టీ ని ప్రకటించడం దేశంలోనే ఒక చారిత్రాత్మకమైన రోజుగా అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు ఉద్యమం చేసి సకల జనులను ఏకం చేసి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ బిడ్డ సీఎం కెసిఆర్ అని అన్నారు. నేడు దేశంలో బీజేపీ పాలనలో అన్ని రంగాల్లో వెనుకబడి పోయిందని, దేశంలో 28 రాష్ట్రాల్లో అభివృద్ది శూన్యమని తెలిపారు.
సీఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అగ్ర స్థానంలో ఉందని తెలిపారు. తెలంగాణ పథకాలు నేడు దేశానికే ఆదర్శంగా ఉన్నాయనో, ఇక్కడి పథకాలు దేశంలో అమలు కావాలంటే బిఆర్ఎస్ తోనే సాధ్యమని చెప్పారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులు కెసిఆర్ పక్షాన ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజానీకం కెసిఆర్ కు అండగా ఉండి కుల, మత రాజకీయాలు చేసే పార్టీలకు చరమగీతం పాడాలని, అది కేవలం బి అర్ ఎస్ పార్టీతోనే సాధ్యమన్నారు.
గతంలో ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీని చులకన చేసి మాట్లాడిన వారు నేడు బిఅర్ఎస్ ను చులకన చేస్తున్నారని, ప్రజల అభిమానం, ఆదరణ కెసిఆర్ వైపే ఉందని పేర్కొన్నారు. భారత దేశానికి కెసిఆర్ లాంటి నాయకుల అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి, నాయకులు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుంబాల రవి యాదవ్, ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, సీనియర్ నాయకులు మామిండ్ల అంజయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.