శాసన మండలి ఉందో లేదో తెలియని సందిగ్ధ స్థితిలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 2020-21 సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ ను ఆమోదించుకోవాల్సిన అనివార్య పరిస్థితులలో అసెంబ్లీ సమావేశం కాబోతుండటం గమనార్హం.
జూన్ 16న శాసనసభలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మార్చి నెలలోనే బడ్జెట్కు ఆమోదం పొందాల్సి ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల కారణంగానూ, కరోనా ఎఫెక్టు కారణంగానూ అది సాధ్యం కాలేదు.
తొలి మూడు నెలల కాలానికి బడ్జెట్ వినియోగం కోసం ఓటాన్ అకౌంట్ రూపంలో ఆర్డినెన్సు ఇచ్చారు. జూన్తో 3 నెలల కాలపరిమితి పూర్తవడంతో జులై నుంచి తిరిగి అవసరమైన ఖర్చులకు బడ్జెట్ ను ఆమోదం పొందాల్సి ఉంది. దీని కోసమే పూర్తి స్థాయి బడ్జెట్ను సభలో సమర్పిస్తారు.
9 నెలల కాలానికి అవసరమైన పద్దుకు ఆమోదం పొందాలి. ఈ సారి బడ్జెట్ అంచనాలు రూ.2.60 లక్షల కోట్లకు పైగా ఉండే అవకాశం ఉంది. కరోనా నేపథ్యంలో రాష్ట్ర సొంత ఆదాయం తగ్గింది. నెలకు సగటున రూ.6000 కోట్ల వరకు రావాల్సిన ఆదాయం 2 నెలలుగా రూ.1300 కోట్లకే పరిమితం అయింది.
ఇప్పుడిప్పుడే ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ పూర్తి స్థాయి ఆదాయం రావడానికి సమయం పడుతుందని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయితే బడ్జెట్ రూపకల్పనలో మాత్రం ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారా లేదా అనే విషయం వేచి చూస్తే కానీ అర్ధం కాదు.