అస్మా బేగం కేసు విషయంలో మరో కోణం వెలుగు చూసింది. వెన్నెముక నొప్పితో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన అస్మా బేగం వెన్నెముకలో బుల్లెట్ ను డాక్టర్లు కనుగొన్న విషయం సత్యం న్యూస్ వీక్షకులకు తెలుసు. వైద్యులు దీన్ని మెడికో లీగల్ కేసుగా భావించి పోలీసులకు సమాచారం అందించారు.
అమ్మాయి వెన్నెముకలో బుల్లెట్ ఉండటం ఏమిటి? ఆ కుటుంబ సభ్యులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం ఏమిటి? అనేది ఇన్ని రోజులు మిస్టరీగా ఉంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించే సరికి మిస్టరీ కొద్దిగా వీడింది. అస్మా బేగం తండ్రి నజీర్ మైలార్ దేవు పల్లి లోని కింగ్స్ ఫంక్షన్ హాల్ లో గత కొన్ని సంత్సరాలుగా వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు.
అక్కడే కుటుంబంతో సహా ఉండేవాడు. కింగ్స్ ఫంక్షన్ హాల్ ఓనర్ షన్ వాజ్ కొడుకు జుబేర్ ఓ పెళ్లి బరత్ లో కాల్పులు జరిపాడట. ఆ సమయంలో ఒక బుల్లెట్ వచ్చి ఈ అమ్మాయికి తగిలిందట. గతంలో జుబేర్ పై మైలార్ దేవులపల్లి పోలీస్ స్టేషన్ కాల్పుల కేసు నమోదు కూడా అయింది.
అయితే అప్పటిలో ఈ అమ్మాయి విషయం వెలుగులోకి రాలేదు. బుల్లెట్ తగిలినా కుటుంబ సభ్యులు పోలీసులకు ఎందుకు చెప్పలేదు అనే అంశంపై దర్యాప్తు సాగుతున్నది. మరింత లోతుగా జుబేర్ కాల్పుల కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సోత్ జోన్ టాస్క్ ఫోర్సు పోలీసులు అస్మా బేగం కుటుంబసభ్యుల ను విచారిస్తున్నారు.