గత 20 ఏళ్ల తన పరిపాలన సంబంధించి కొల్లాపూర్ నియోజకవర్గంలో సాధించిన అభివృద్ధి సంబంధించిన అంశాలతో కూడిన క్యాలెండర్ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. బుధవారం మండల పరిధిలోని పలు గ్రామాలలో తన కార్యకర్తల ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా తాను ఎమ్మెల్యే, మంత్రిగా సాధించిన ప్రగతి అంశాలతో కూడిన క్యాలెండర్ను ఆవిష్కరించారు.
20 సంవత్సరాలుగా ఉమ్మడి జిల్లాలో కొల్లాపురం అభివృద్ధి పథంలోకి నడిపిన ఘనత తనదేనని విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, పీజీ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులకు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, జూరాల గ్రావిటీ కెనాల్, బీమా పథకాల ద్వారా సాగునీటి అందించిన ఘనత తనదేనని అన్నారు. ఎర్ర బస్సు ఎరగని గ్రామాల ను సైతం ఆర్టీసీ డిపో తో ప్రతి గ్రామానికి రోడ్లు మరియు బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది అన్నారు.
రైతులకు అందుబాటులో ధాన్యం నిలువ చేసుకునే గోదాము, నూతన మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేశామని తన తల్లిదండ్రుల పేరుపై రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తను విద్యాసంస్థలకు ఉచిత స్థలాలు అందించడం జరిగిందని, నిర్వాసితులుగా ముంపుకు గురైన అయ్యవారిపల్లి గ్రామస్తులకు ఇళ్లస్థలాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు, విద్యార్థులకు కంప్యూటర్, కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాలు అందించి సుమారు పదివేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత తనకు దక్కిందని వారు పేర్కొన్నారు.
20 ఏళ్లుగా ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసమే పనిచేశానని.. నూతన సంవత్సరం సందర్భంగా కొల్లాపూర్ ప్రగతితో కూడిన క్యాలెండర్ను ఆవిష్కరిస్తూ ప్రతి గడపగడపకు తీసుకెళ్తున్నామని… ప్రజాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని ఆయన అన్నారు. పలు గ్రామాలలో వందలాది క్యాలెండర్ ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర రెడ్డి, మాజీ సర్పంచ్ బీచ్ పల్లి యాదవ్, నాయకులు విద్యాసాగర్ రావు, మాజీ జెడ్పిటిసి కృష్ణ ప్రసాద్ యాదవ్, సర్పంచులు రంజిత్ కుమార్, కొత్త కళ్యాణ్ రావు, వడ్డేమాన్ బిచన్న గూడెం గోవిందు వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.