సత్తా ఉంటే రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలో పోటీ చేయాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి సవాలు విసిరారు.
దమ్ముంటే చంద్రబాబు పుంగనూరులో పోటీ చేయాలని పెద్దిరెడ్డి విసిరిన సవాల్ కు దీనిని ప్రతి సవాల్ గా స్వీకరించాలన్నారు.
అలాగే చంద్రబాబు కుప్పంలో ఓడిపోతారంటూ అంబటి రాంబాబు పిల్లిశాపాలు పెట్టడం మానుకోవాలన్నారు. ఈ ఇద్దరు నేతలకు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్టు కుడా దక్కదని జోస్యం చెప్పారు.
అక్రమంగా ఎర్రచందనం, ఇసుక,మద్యం అమ్మిన సొమ్ములో 20 కోట్లు ఖర్చు పెట్టి కుప్పంలో ఎక్కువ పంచాయతీలు గెలిచినంత మాత్రాన సంబరపడి పోవడం తగదని హితవు పలికారు. అలాగే పోలీసులను అడ్డుపెట్టుకుని భయపెట్టి, ప్రలోభ పరచి గెలిచిన గెలుపు గెలుపుకాదు వాపని గుర్తించాలన్నారు.
చంద్రబాబును కుప్పంలో ఓడించడం ఎవరి తరము కాదని తేల్చి చెప్పారు.
అయన కుప్పంలో 1989 నుంచి వరుసగా ఏడు సార్లు అత్యధిక మెజారిటీతో గెలిచిన ఓటమి ఎరుగని ధీరుడన్న విషయం పెద్దిరెడ్డి, అంబటి గుర్తుంచుకోవాలని కోరారు.
రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ చేస్తున్నది సంక్షేమ పాలన కాదని, ఆ ముసుగులో దోపిడీ సాగిస్తున్నారని సుధాకర్ రెడ్డి దుయ్యబట్టారు.