కొన్నిరోజుల కిందట టీడీపీ అధినేత చంద్రబాబును విశాఖలో ఆందోళనకారులు అడ్డుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిరసనల తీవ్రత దృష్ట్యా ఆయన తన పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది.
ఆ రోజున చంద్రబాబును వైసీపీ కార్యకర్తలు అడ్డుకుని, దౌర్జన్యం చేశారంటూ ఇప్పటికే టీడీపీ నేతలు విశాఖ సీపీ ఆర్కే మీనాకు ఫిర్యాదు చేశారు. దీనిపై సీపీ ఆర్కే మీనా స్పందిస్తూ, విశాఖ ఘటనపై వైసీపీ, టీడీపీల నుంచి ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.
151, 353, 341 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని చెప్పారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇరుపార్టీలపై 5 కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఈ ఐదు కేసుల్లో ఇప్పటిదాకా 50 మందిని అరెస్ట్ చేశామని వివరించారు.