కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ స్వపరిపాలన కోసం గ్రామ పంచాయితీలకు వచ్చిన నిధులను రాష్ట్రంలోని వై ఎస్ జగన్ ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు మళ్లించడంపై ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు Y.V.B. రాజేంద్ర ప్రసాద్ హైకోర్టులో కేసు దాఖలు చేశారు.
రాష్ట్రంలోని 12918 గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 2019 -22 వరకు పంపించిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.7660 కోట్లు కాగా సర్పంచులకు తెలియకుండా ఆ నిధులను జగన్ ప్రభుత్వం కాజేసిందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల సంతకాలు లేకుండా పంచాయితీ అకౌంట్లు జీరో బ్యాలెన్స్ చేసిందని ఆయన తెలిపారు. ఇది స్థానిక స్వపరిపాలన అనే ఆదర్శవంతమైన విధానానికి గండి కొడుతున్నదని, ఇలా చేయడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
ఈ అంశంపై మొత్తం రెండు కేసులను వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ (అధ్యక్షులు) , ముల్లంగి రామకృష్ణారెడ్డి (కార్యదర్శి), కె.లోకేశ్వరి (సర్పంచ్, కడప జిల్లా), పోతుల అన్నవరం (సర్పంచ్,పశ్చిమ గోదావరి జిల్లా) దాఖలు చేశారు. నిధులు, విధులు, అధికారాల సాధనకై రాష్ట్రవ్యాప్తంగా, రాజకీయాలకతీతంగా ఉద్యమాలను ఉధృతం చేయడానికి సర్పంచులు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచులు సంఘాలు హెచ్చరించాయి.