ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, పాలేరు అసెంబ్లీ ఇంచార్జ్ బండి రమేష్ ఆరోపించారు. బుధవారం నాడు స్థానిక సుందరయ్య భవనం నందు జరిగిన సోషల్ మీడియా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికొదిలేసి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని అన్నారు.
చరిత్రను బీజేపీ వక్రీకరించి పబ్బం గడుపుకోవాలని చూస్తోందన్నారు. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలని ప్రభుత్వాలు చూస్తున్నాయన్నారు. పాలేరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కమ్యూనిస్టులతోనే సాధ్యమవుతుందని వారు అన్నారు. గతంలో నియోజకవర్గ నుండి సిపిఎం ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అనేక సమస్యలు పరిష్కరించబడ్డాయని వారు గుర్తు చేశారు.
భవిష్యత్తులో కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం నిక్కచ్చిగా, నిజాయితీగా పనిచేసేది సిపిఎం మాత్రమే అని వారన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న డబ్బు రాజకీయాలను ప్రజలు ఓడిరచాలన్నారు. ప్రజలకు సేవ చేసి ఓట్లు అడిగే పరిస్థితి కాకుండా డబ్బుల ద్వారా ఓట్లు తెచ్చుకోవచ్చని తప్పుడు సంస్కృతిని నియోజకవర్గంలో చేస్తున్నారని వారన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో యువకులు కదిలి డబ్బు రాజకీయాలను వ్యతిరేకించాలనిపిలుపునిచ్చారు.
నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సరిపడా వైద్య సిబ్బంది లేకపోవడం వల్ల సరైన వైద్యం అందడం లేదని, తక్షణమే నియోజకవర్గంలో అన్ని హాస్పిటల్స్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా పాలేరు గ్రామంలో ఉన్న సంత ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలన్నారు.
అర్హులైన వేలాది మంది పేదలకు నియోజకవర్గంలో పింఛన్లు రావడం లేదని, తక్షణమే మంజూరు చేయాలని కోరారు. రైల్వే లైన్ల పేరుతో బహుళ పంటలు పండే భూమిని నియోజకవర్గంలో పేద, చిన్న, సన్నకారు రైతుల నుండి గుంజుకుంటున్నారని, వారికి కనీస పరిహారం కూడా సరిగ్గా అందజేయడం లేదని విమర్శించారు. ఖమ్మం రూరల్, కూసుమంచి, తిరుమలాయపాలెం మండల కేంద్రాల్లో బస్టాండ్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు.
ప్రతి మండలంలో జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయాలని, నియోజకవర్గ స్థాయిలో డిగ్రీ కాలేజీ కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం రూరల్ మండలంలో ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ ఒకే చోట లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. వాటన్నిటిని ఒకే చోట నిర్మించాలన్నారు. నియోజకవర్గంలో ఎస్సీ. ఎస్టీ, బిసి విద్యార్థుల కోసం ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు.
నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ ప్రస్తుత పాలకులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తక్షణమే ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని తెలియజేశారు. భవిష్యత్తులో సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేశారు.
గతంలో, ప్రస్తుతం, భవిష్యత్తులో కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేసేది కమ్యూనిస్టు లేనని వారన్నారు.ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా రాష్ట్ర నాయకులు పిట్టల రవి, సోషల్ మీడియా పాలేరు అసెంబ్లీ ఇంచార్జ్ సంగబత్తుల నవీన్ రెడ్డి, నియోజకవర్గ బాధ్యులు బోడపట్ల కార్తీక్, వివిధ మండలాలకు చెందిన నాయకులు సతీష్, మహేందర్, వీరారెడ్డి, ఉమేష్, మల్లికార్జున్, నవీన్, పవన్, తరుణ్, నరేందర్, పవన్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.