వివాదాస్పద సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ఈశాన్య రాష్ట్రాలను ఇంకా కుదుపేస్తోంది. ఈ చట్టంపై ఈశాన్య రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఈ చట్టాన్ని రద్దు చేసే అవకాశాలను పరిశీలించేందుకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
ఐదుగురు సభ్యుల కమిటీకి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, సెన్సస్ కమిషనర్ వివేక్ జోషి నేతృత్వం వహిస్తుండగా, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి పీయూష్ గోయల్ ఈ కమిటీకి సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. కమిటీలోని ఇతర సభ్యులు నాగాలాండ్ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, అస్సాం రైఫిల్స్ డీజీపీ సభ్యులుగా ఉంటారని పేర్కొంది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరుసగా నాగాలాండ్ సీఎం నెఫియు రియో, అస్సాం ముఖ్యమంత్రులు హిమంత బిస్వా శర్మలతో సమావేశం నిర్వహించిన మూడు రోజుల తర్వాత ఈ కమిటీని ఏర్పాటు చేశారు. డిసెంబర్ 23న న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో నాగాలాండ్ ఉపముఖ్యమంత్రి వై పాటన్, నాగాలాండ్ మాజీ ముఖ్యమంత్రి టిఆర్ జెలియాంగ్ కూడా పాల్గొన్నారు. 45 రోజుల్లో కమిటీ తన నివేదికను సమర్పించనుంది.