ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పండించిన జొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, అవి ఆత్మహత్యలు కావని ముమ్మాటికీ అవి ప్రభుత్వ హత్యలే నని ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత అన్నారు.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం లో రైతులు పండించిన జోన్న పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పొచ్చెర ఎక్స్ రోడ్ వద్ద మంగళవారం ఆందోళన నిర్వహించేందుకు వెళుతున్న ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత తో పాటు కాంగ్రెస్ నాయకులను తెల్లవారుజామున పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ తమ స్వగృహంలోని బైఠాయించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ మేరకు గండ్రత్ సుజాత మాట్లాడుతూ రైతులు రోడ్డెక్కితే గానీ, లాఠీ దెబ్బలు తింటే గానీ తమ పంటను అమ్ముకో లేని దుస్థితి నెలకొందని అన్నారు. సీఎం కేసీఆర్ చెప్పిన పంటలను వేసినప్పటికి ప్రభుత్వం రైతులు పండించిన పంటకు కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు.
బోథ్ మండలం లో రైతులు పండించిన జొన్న పంట పశువుల దాణా గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా వెళ్లే తమను ఒక ఉగ్రవాదుల, తీవ్రవాదుల ఇళ్లల్లోని అరెస్టు చేయడం, తమ కార్యకర్తలను రాత్రంతా పోలీస్ స్టేషన్ లో ఉంచడం చూస్తే ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనంగా మారిందని ధ్వజమెత్తారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి కొండ గంగాధర్, వెంకట్ రెడ్డి, కౌన్సిలర్ సృజన్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సాయి చరణ్ గౌడ్, తాంసీ మండల అధ్యక్షుడు కౌడాల సంతోష్, భీంసరి ఉప సర్పంచ్ మల్లయ్య, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సామ రూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.