తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సబ్బండ వర్గాల ఆత్మ గౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ అని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కొనియాడారు.
చాకలి ఐలమ్మ 126వ. జయంతి సందర్భంగా ఆదివారం వనపర్తిలోని కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషతో కలిసి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, దోపిడీ,పీడన నుంచి విముక్తి కోసం జరిగిన ఆనాటి సాయుధ రైతాంగ పోరాటంలో దొరల గడీలను గడగడ లాడించిన వీరనారి చాకలి ఐలమ్మ అని, ఆమె ధైర్యసాహాసాలు, ఆశలు, ఆశయాలను స్పూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ భూమి నాది…పండించిన పంట నాది…తీసుకెళ్లడానికి దోరేవ్వాడు ..అని సాయుధ రైతాంగ పోరాటం చేసిన తెలంగాణ వీర వనిత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన యోధురాలు జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఇక నుండి ప్రతి ఏటా రాష్ట్ర వేడుకగా అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మాట్లాడుతూ చాకలి ఐలమ్మ మహిళలకు స్ఫూర్తిదాయకమని ఆమె అన్నారు. ప్రభుత్వం ప్రతి యేటా ఆమె జయంతి ఘనంగా నిర్వహించడానికి చర్యలు తీసుకున్నదని జిల్లా కలెక్టర్ అన్నారు. పట్టుదలకు, పోరాటానికి ఆమె పూర్తి అని జిల్లా కలెక్టర్ అన్నారు.
అంతకుముందు మంత్రి, జిల్లా కలెక్టర్ వనపర్తి పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, (లోకల్ బాడీ) అంకిత్, బీసీ అభివృద్ధి అధికారి, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, ఎమ్మార్వో రాజేందర్ గౌడ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, రజక సంఘం నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్