పాకిస్తాన్లో ఆర్థిక పరిస్థితి ఇప్పటికీ దయనీయంగానే ఉంది. ఇప్పుడు ఆహార పదార్ధాల కోసం ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. పాకిస్తాన్లోని ఓడరేవు నగరం కరాచీలోని రంజాన్ ఆహార పంపిణీ కేంద్రంలో శుక్రవారం జరిగిన తొక్కిసలాటలో మహిళలు, పిల్లలు సహా కనీసం 11 మంది మరణించారు. అంతే కాదు పలువురు గాయపడ్డారు. కొందరు వ్యక్తులు తెలియకుండా విద్యుత్ తీగను తొక్కడంతో కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగింది.
దీంతో ఈ ప్రమాదం జరిగింది. కరాచీలో జరిగిన ఈ తాజా సంఘటనతో, పాకిస్తాన్లోని ఉచిత ఫుడ్ సెంటర్లలో ఇప్పటి వరకూ జరిగిన తొక్కిసలాటలలో మరణించిన వారి సంఖ్య 22 కి చేరుకుంది. దాదాపు దివాలా అంచుకు చేరిన పాకిస్థాన్కు చైనా మరోసారి మద్దతు పలికింది. పాకిస్తాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ శుక్రవారం మాట్లాడుతూ, చైనా గత వారం 2 బిలియన్ డాలర్ల రుణాన్ని ఇచ్చిందని, ఇది పాకిస్తాన్ చెల్లింపుల బ్యాలెన్స్ సంక్షోభానికి తక్షణ ఉపశమనం కలిగించిందని అన్నారు. సంబంధిత పత్రాలన్నీ పూర్తి చేశామని ఇషాక్ దార్ పార్లమెంట్లో తెలిపారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)తో స్టాఫ్ లెవల్ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి పాకిస్తాన్కు ఈ ఉపశమనం కూడా సహాయపడుతుంది.