కౌన్సిల్ లో నిన్న టిడిపి ఎమ్మెల్సీలు అసాధారణ రీతిలో పోరాడారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. టిడిపి నేతలతో ఆయన నేడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,ఇతర నేతలు ఇందులో పాల్గొన్నారు. వైసిపి మంత్రులు కౌన్సిల్ ఛైర్ పర్సన్ షరీఫ్ పై దాడి చేశారని, ముస్లిం సమాజాన్ని అవమానపర్చేలా దుర్భాషలాడారని చంద్రబాబునాయుడు అన్నారు.
అసభ్య పదజాలంతో చైర్మన్ ని అవమానించారని చంద్రబాబునాయుడు అన్నారు. అంతే కాకుండా కౌన్సిల్ ఛైర్ పర్సన్ షరీఫ్ నమాజు చేయనీయకుండా వైసిపి మంత్రులు అడ్డం పడ్డారని ఆయన అన్నారు. మీకూ పిల్లలు, మనవళ్లు ఉన్నారని గుర్తుంచుకోండని మంత్రులు కౌన్సిల్ ఛైర్మన్ బెదిరించారని ఆయన అన్నారు.
ముగ్గురు మంత్రులు లోకేష్ పై దౌర్జన్యం చేశారని చంద్రబాబు తెలిపారు. రింగుదాటి వస్తే బైట పడేయండని సీఎం జగన్ మార్షల్స్ ను నేరుగా ఆదేశించారని, మరి అదే వైసిపి మంత్రులు కౌన్సిల్ లో చేసిందేమిటి? పోడియం బల్లలు ఎక్కి, పేపర్లు చించి సభాపతిపై విసిరిన మంత్రులను, వైసిపి ఎమ్మెల్సీలను ఏం చేయాలి? అని చంద్రబాబు ప్రశ్నించారు.