వ్యాక్సిన్ల కోసం జగన్ కేంద్రానికి లేఖ రాశారని నిన్న, మొన్నటి వరకు మంత్రులు ప్రకటనలు ఇచ్చారని, ఇప్పుడు బాధ్యతల నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ సీనియర్ నేతలతో ఆయన నేడు సమావేశం నిర్వహించారు.
50 శాతం వ్యాక్సిన్ రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేట్ ఆస్పత్రులకు ఇచ్చేలా కేంద్రం విధానం తెచ్చిందని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించిందని ఆయన అన్నారు. ఆ ప్రకటన ప్రకారం అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల డోసుల కోసం సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్కు ఆర్డర్లు ఇచ్చాయని, అడ్వాన్సు చెక్కులిచ్చి వ్యాక్సిన్ పొందుతున్నాయని చంద్రబాబునాయుడు అన్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం అయితే గ్లోబల్ టెండర్లను పిలిచిందని చంద్రబాబునాయుడు తెలిపారు. మరి జగన్ ప్రభుత్వం వ్యాక్సిన్ కోసం ఎందుకు ఆర్డర్లు పెట్టలేదు? అని ఆయన ప్రశ్నించారు. వ్యాక్సిన్ కు రూ. 1600 కోట్లు అవసరం కాగా రూ.45 కోట్లు మాత్రమే మంజూరు చేశారని, ప్రజల ప్రాణాలకు మీరిచ్చే విలువ ఇదేనా? అని ఆయన ప్రశ్నించారు.
ప్రజల ప్రాణాలకన్నా కమిషన్లు దండుకునే ముఖ్యమంత్రికి అధికారంలో కొనసాగే హక్కుందా? అని ఆయన అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడాలి లేదా సీఎంగా తప్పుకోవాలని ఆయన అన్నారు. కరోనా బాధితులకు ప్యాకేజీ ఇవ్వాలని, ఏపీలో అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించి కోవిడ్ బాధితులతోపాటు పేదల ఆకలి తీర్చాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.
చాలా రాష్ట్రాల్లో18-45 ఏళ్ల వారికి కూడా వాక్సినేషన్ చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. చివరకు వాక్సిన్ లు తెప్పించలేక తనపై నెపం నెట్టే కుట్రకు దిగజారారని ఆయన అన్నారు. నేను వ్యాక్సిన్ తెప్పిస్తే మరి మీరెందుకు? అని చంద్రబాబు ప్రశ్నించారు.