ఉపాధి హామి కూలీ లకు పెండింగ్ లో ఉన్న ఉపాధి కూలీల వేతనాలను వెంటనే చెల్లించాలని,కేంద్రప్రభుత్వం తెచ్చిన జీవో 333 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మే 23న,సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాకు ఉపాధి కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పోషణ బోయిన హుస్సేన్ పిలుపునిచ్చారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండల పరిధిలోని అమరవరం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను బుధవారం హుస్సేన్ పరిశీలించి మాట్లాడుతూ ఉపాధి కూలీలకు 8 వారాల నుంచి ఉపాధి కూలీ డబ్బులు రావడంలేదని,రోజుకు కూలీ 70-90 రూపాయలు మించి రావడం లేదని,ఎండ తీవ్రతా అధికంగా ఉందని, టెంట్లు, మంచినీటి సౌకర్యం కల్పించడం లేదని,తట్టలు,పార పనిముట్లు అందించడం లేదని, వ్యవసాయ కార్మిక సంఘం దృష్టికి తీసుకు వచ్చారు.ఉపాధి కూలీలకు 259 రూపాయలు ఇవ్వాలని,చట్టంలో ఉన్న ఎక్కడా అమలు చేయడం లేదని అన్నారు. ఎండలో సైతం పనులు చేస్తున్నప్పటికీ గిట్టుబాటు కూలీ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీలకు నష్టం కలిగించే విధంగా నూతనంగా 333 జి.ఓ తెచ్చిందని,ఇట్టి జి.ఓ. తక్షణమే రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. మండుటెండలో పనిచేస్తున్న ఉపాధి కూలీలకు కూలీ డబ్బులు పెండింగ్ లో పెట్టడం సిగ్గుచేటని అన్నారు. పార,పనిముట్లను ఇవ్వాలని, కనీస సౌకర్యలు కల్పించాలని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలకు వారం లోపల కూలి ఇవ్వాలని చట్టంలో పొందుపరిచినప్పటికి 8 వారాల నుండి కూలీ డబ్బులు చెల్లించకపోవడం సిగ్గుచేటు అన్నారు.
పెండింగ్ వేతనాలు మూలంగా కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,తక్షణమే కూలీలకు రావాల్సిన డబ్బులను చెల్లించాలని అన్నారు. ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మికసంఘం నాయకులు షేక్ సైదా, కాసిం,సీతారాములు,బాల సైదులు,అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్