రాష్ట్రంలో అన్ని పంటలకు రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలని, ఈ విషయంలో రైతులను చైతన్యం చేసేందుకు ప్రణాళిక చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో నేడు జరిగిన వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యాన శాఖలు, విత్తన, మార్క్ ఫెడ్, వేర్ హౌజింగ్, అగ్రోస్ సంస్థల ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, అగ్రోస్ ఎండీ రాములు, మార్క్ ఫెడ్ ఎండీ భాస్కరాచారి తదితరులు హాజరయ్యారు.
శాస్త్రీయ పద్దతిలోనే రైతులు ఎరువులను వినియోగించాలని ఆయన కోరారు. వచ్చే ఏడాదికి పచ్చిరొట్ట పంట విత్తనాలను పెద్దమొత్తంలో సేకరించి అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు.
రైతుబజార్లలో మిగిలే జీవ వ్యర్థాలను ఎరువులుగా మార్చేందుకు ప్రణాళిక రూపొందించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, దీనిపై జిల్లా కలెక్టర్లను సంప్రదించాలని మంత్రి కోరారు. మొక్కజొన్న సేకరణ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా మార్క్ ఫెడ్ ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు.
అదే విధంగా డిసెంబరులో కందుల సేకరణకు కార్యాచరణ చేపట్టాలని ఆయన అధికారులకు సూచనలు చేశారు. పంట కొనుగోళ్లకు అవసరమయ్యే గోనెసంచులు అంచనాలకు అనుగుణంగా యుద్దప్రాతిపదికన సేకరించి అందుబాటులో ఉంచాలని ఆయన కోరారు.
ధరలు అదుపులోకి వచ్చే వరకు రైతుబజార్లలో ఉల్లిగడ్డల అమ్మకాలను కొనసాగించాలని ఆయన ఆదేశించారు.