ఆదివాసి గిరిజన చెంచు పెంటల అభివృద్ధికి నిబద్ధతతో ఉన్నానుని రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ అన్నారు. తాను దత్తత తీసుకున్న ఆదివాసి గిరిజన గ్రామాలలోని ఒకటైన నాగర్ కర్నూలు జిల్లా ఆప్పాపూర్ ఆదివాసి గిరిజన చెంచు పెంట ను గవర్నర్ శనివారం సందర్శించారు.
ముందుగా గవర్నర్ కు మన్ననూరు లోని హరిత హోటల్ వద్ద జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్,జిల్లా ఎస్ పి కె .మనోహర్ లు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ హరిత హోటల్ లో మొక్కలు నాటారు.
అనంతరం మన్ననూరులోని అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ మృగ వని గెస్ట్ హౌస్ లో రిజర్వ్ ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ లో చేపట్టిన కార్యక్రమాలపై రాష్ట్ర గవర్నర్ కు వివరించారు.
ముఖ్యంగా రిజర్వ్ ఫారెస్ట్ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, నీటి నిర్వహణ, అగ్ని ప్రమాదాల నివారణ, నిర్వహణ, అడవుల పునరుద్ధరణ, అడవుల సంరక్షణ కార్యకలాపాలపై వివరించారు.
ఇక్కడే రిజర్వ్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో గిరిజన చెంచు మహిళలకు ఏర్పాటు చేసిన చేతి వృత్తుల కార్యక్రమం లబ్ధిదారులతో రాష్ట్ర గవర్నర్ కలుసుకుని వారితో మాట్లాడారు. వారు తయారుచేసిన వస్తువులను పరిశీలించారు.
అనంతరం ఆమె లింగాల మండలం అప్పాపూర్ గిరిజన చెంచు పెంటకు బయలుదేరి వెళ్లారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ కార్యదర్శి సురేంద్రమోహన్, జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్,అదనపు కలెక్టర్ మను చౌదరి,సి ఎఫ్ శ్రీనివాస్,డి ఎఫ్ ఓ కిష్టగౌడ్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అవుట రాజశేఖర్, సత్యం న్యూస్. నెట్, కొల్లాపూర్