పశ్చిమబెంగాల్ ఎన్నికలను భాజపా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత లోకసభ ఎన్నికలలో 18 స్థానాలలో అనూహ్యంగా విజయం సాధించింది. అప్పటినుంచి పశ్చిమబెంగాల్ అసెంబ్లీపై కాషాయజెండా ఎగురవేయడానికి పథకరచన చేస్తూనేఉంది.
2016 లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ ఏకంగా 211 స్థానాలలో గెలిచి రెండోసారి అధికారం చేపట్టగా…..ఎన్డీఏ కేవలం 6 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్-సీపీఎం,వామపక్షాలతో కూడిన మహాతోజ్ కూటమి 44 స్థానాలలో గెలిచింది.
తాజాగా 8 దశలలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ మొత్తం 291 స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. వారిలో 114 మంది కొత్తవారికి పార్టీ టికెట్లు కేటాయించడం గమనీయం.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలను భాజపా లోకి ఆహ్వానించి ఆ పార్టీని బలహీనపరచే ఉద్దేశంతో అమిత్ షా రంగంలోకి దిగినట్లు తృణమూల్ కాంగ్రెస్ విమర్శిస్తోంది. విచ్చలవిడిగా డబ్బు వినిమయం, అధికారుల ప్రమేయం, సీబీఐ, ఈడీ వంటి ప్రభుత్వ సంస్థల జోక్యంతో తృణమూల్ కాంగ్రెస్ కు అధికారం దక్కకుండా చేయాలని మోదీ- అమిత్ షా ద్వయం కుయుక్తులు పన్నుతున్నారని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత డెరెక్ ఓ.బ్రెన్ మీడియాకు తెలిపారు.
తన రాష్ట్రంలో శాంతి భద్రతలు గాలికొదిలిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అజయ్ బిష్త్ అలియాస్ యోగి పశ్చిమ బెంగాల్ ప్రజలలో భయాందోళనలు సృష్టించేందుకు సాహసించడం తగదని ఆయన అన్నారు.
గత 10 సంవత్సరాల కాలంలో మమతాబెనర్జీ అందించిన సుపరిపాలనకు ప్రజామోదం లభించి , మరోసారి తృణమూల్ కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
లెఫ్ట్ – కాంగ్రెస్ కూటమి ఐ ఎస్ ఎఫ్ కు ఓటేస్తే భాజపా కు లాభం చేకూరుతుందని విశ్లేషించారు. రాష్ట్రంలో ఉన్న విభిన్నవర్గాల ప్రజలతో పాటు 30 శాతం ఉన్న మైనార్టీలు తృణమూల్ కాంగ్రెస్ పట్ల అనుకూలంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయంలో భాజపా ఇంకా ఒక నిర్ణయానికి రాకపోవడం ఆ పార్టీ బలహీన తగా ఆయన చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో …. పశ్చిమ బెంగాల్ లో గెలవడం భాజపాకు చాలా అవసరం. 18 మంది పార్లమెంట్ సభ్యల బలం ఉన్నచోట అధికారం దక్కించుకోవడం సులభమేనని ఆ పార్టీ విశ్వసిస్తోంది.
అస్సాం, కేంద్రపాలిత ప్రాతం పుదుచ్చేరీలతో పాటు పశ్చిమ బెంగాల్ లో స్వతంత్రంగా గెలిచి, అధికారం చేపట్టడానికి
భాజపా సకల అస్త్రశస్త్రాలను సిద్ధంచేస్తోంది. ఆకర్ష్ పథకం ఆశాజనకంగా ఉన్నట్లు పార్టీ వర్గాలలో వినిపిస్తోంది.
మమతాబెనర్జీ ప్రభుత్వం పై ఉన్న అసమ్మతి తనకు అనుకూలంగా మారుతుందని భాజాపా అధిష్టానం నమ్ముతోంది.
కానీ….పెరుగుతున్న పెట్రోల్, గ్యాస్, ఇతర వస్తువుల ధరలు, రైతు వ్యతిరేక విధానాలపై సాగుతున్న ఉద్యమం, స్థానిక సమస్యలపై కేంద్రం వైఖరి వంటి అంశాలపై భాజపా విజయం ఆధారపడి ఉంది.
పశ్చిమ బెంగాల్ ఓటరు మరోసారి ఫైర్ బ్రాండ్ మమతాబెనర్జీ కి పట్టం కట్ట బోతున్నారా? లేదా మోదీ – అమిత్ షా వ్యూహం ఫలించి భాజపా కు అధికారం ఇస్తారా ? అనేది ఇప్పుడు అత్యంత ఉత్కంఠగా మారింది.
పొలమరశెట్టి కృష్ణారావు