ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి నెల రోజులు కాక ముందే ఆదిత్యానాథ్ దాస్ కు చుక్కలు కనిపిస్తున్నాయి.
కరవమంటే కప్పకు కోపం… విడవమంటే పాముకు కోపం అన్న చందాన ఆయన పరిస్థితి మారింది. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ చెప్పిన విషయాలను ముఖ్యమంత్రికి, మంత్రులకు చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఆయన ఉండటంతో పరిస్థితులు మరింత విషమిస్తున్నాయి.
రాష్ట్ర గవర్నర్ ఎన్నికల కమిషనర్ డాక్టర్.ఎన్.రమేష్ కుమార్ ను, ఆదిత్యానాథ్ దాస్ ను విడివిడిగా పిలిచి మాట్లాడి రాజీమార్గం సూచించారు. అయితే అది అమలు జరగలేదు. దీనికి కారణం ఆదిత్యానాథ్ దాస్ ఎవరికి సర్దిచెప్పలేకపోవడమేనని అంటున్నారు.
ఇదే విషయంపై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా వత్తిడి తీసుకువస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల కమిషనర్ ను దారికి తీసుకురావడంలో ఆదిత్యానాథ్ దాస్ విఫలమయ్యారని ముఖ్యమంత్రి అంటున్నారని తెలిసింది. ఇటు ఎన్నికల కమిషనర్ కు చెప్పలేక అటు ముఖ్యమంత్రికి మంత్రులకు సర్దిచెప్పలేక ఆయన సతమతం అవుతున్నారు.
మరో వైపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పట్టిన పట్టు వీడకుండా ప్రతి రోజూ కొత్త ఆదేశాలు ఇస్తున్నారు. ఈ ఆదేశాలను అమలు చేయలేకపోతే ఆ ‘‘నేరం’’ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మెడకే చుట్టుకుంటుంది. గవర్నర్ చేసిన రాజీ కూడా మంత్రులు వినేపరిస్థితి లేకపోవడం ఆదిత్యానాథ్ దాస్ కు మరింత ఇరకాట పరిస్థితి తెచ్చిపెడుతున్నది.
పరిస్థితిని మరింత జటిలం చేసుకుంటున్న అధికార పార్టీ నేతలకు ఆయన ఏం చెప్పలేకపోతున్నారు. ముఖ్యమంత్రి నుంచి ఆయనకు మరో రకం వత్తిడి వస్తున్నది. రమేష్ కుమార్ కు గట్టిగా సమాధానం చెప్పడం లేదని ముఖ్యమంత్రి భావిస్తుండటం ఆదిత్యానాథ్ దాస్ కు మరో సంకటంగా మారింది.