29.7 C
Hyderabad
April 29, 2024 08: 35 AM
Slider ఆంధ్రప్రదేశ్

షోకాజ్ నోటీసు జారీ చేయడమే ఎల్ వి చేసిన తప్పు

YS Jagan Review Meeting_2_0

ముఖ్యమంత్రి కార్యదర్శికి షోకాజ్ నోటీసు జారీ చేయడం వల్లనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆకస్మికంగా బదిలీ చేసినట్లు సిఎం కార్యాలయం స్పష్టం చేసింది. మంత్రివర్గ ఎజెండాను తనకు తెలియకుండా ఖరారు చేయడం తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యదర్శి అయిన ప్రవీణ్ ప్రకాశ్ కు షోకాజ్ నోటీసు జారీ చేశారు.

అన్ని నిర్ణయాలూ ప్రధాన కార్యదర్శికి తెలిసేలాగానే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటున్నారని అయినా ప్రవీణ్ ప్రకాశ్ కు షోకాజ్ నోటీసు జారీ చేయడం ఏమిటని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రశ్నిస్తున్నది. ఇటీవలి కాలంలో ఫలానా శాఖకు చురుకైన అధికారి ఉండాలి అని సీఎం సమీక్షా సమావేశాల్లో అడుగుతున్నారు. అంతేకాదు తాను అనుకున్న లక్ష్యాలు నెరవేర్చడానికి కష్టపడే మనస్తత్వం, చురుగ్గా ఉండే వాళ్లు కావాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారు. కాని ఆయన సూచించిన వారి పేర్లు వారాల తరబడి పెండింగులో ఉండిపోతున్నాయి.

ఫలానా వ్యక్తిని ఫలానా స్థానంలో పెట్టాలని సీఎం  నేరుగా చెప్పినా ఫలితం ఉండడంలేదు. తనకు నచ్చడంలేదనే వ్యక్తిగత కారణంతో రోజులు తరబడి ఐఏఎస్‌ అధికారుల నియామకాలు చీఫ్ సెక్రటరీ నిలిపివేస్తున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ప్రవీణ్‌ ప్రకాష్‌కు జారీచేసిన నోటీసుల్లో రెండు కారణాలను ఎల్వీ సుబ్రహ్మణ్యం చూపించారు. వాస్తవానికి ఆ రెండు కూడా ముఖ్యమంత్రి సమక్షంలో, ఇతర అధికారులు, సీఎస్‌ ఉన్నప్పుడు తీసుకున్నవే. ఆ నిర్ణయాలు సీఎస్‌కు తెలియకుండా జరిగినవి కావు అంటూ ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ ఇచ్చింది.

వైయస్సార్‌ పేరు పై లైఫ్‌టైం అవార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేబినెట్‌ సమావేశానికి ముందు ఎజెండాలో ఎలాంటి అంశాలు పెట్టాలన్నదానిపై జరిగిన సన్నాహక సమావేశంలో సీఎం కార్యాలయ కార్యదర్శులు, చీఫ్‌ సెక్రటరీతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలో సామాజిక సేవ, ఇతరత్రా రంగాల్లో సేవచేసినవారికి ప్రతిభ చూపిన వారికి ఇవ్వాలని నిర్ణయించినట్టుగా ఈ సమావేశంలో నేరుగా ముఖ్యమంత్రే సీఎస్‌కు వెల్లడించారు. అక్కడ సీఎస్‌ దీనికి అంగీకారం కూడా తెలిపారు.

రేపటి క్యాబినెట్‌ అజెండాలో పెడదామన్నా అని సీఎం చెప్పారు కూడా. తీరా ప్రవీణ్‌ ప్రకాశ్ ఫైలు తయారుచేశాక ఆర్థిక శాఖ అనుమతి లేదని వెనక్కి పంపారు. వాస్తవానికి ఆర్థికశాఖ అనుమతితో సంబంధం లేకుండా ఫైలును కేబినెట్లోనే పెట్టొచ్చు. ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని ఆర్థికశాఖతో సమన్వయం చేసుకోవచ్చు. సీఎం ఎదుట ఓకే అని, ఆ తర్వాత కొర్రీ పెట్టడం సీఎస్‌పై ఆగ్రహానికి దారితీసిందని సిఎం కార్యాలయం వివరణ ఇచ్చింది. ప్రవీణ్‌ ప్రకాష్‌కు సీఎస్‌జారీచేసిన నోటీసులో మరొక ముఖ్యమైన అంశం గ్రామ న్యాయాలయాలు అంశం.

హైకోర్టు ఆదేశాల ప్రకారం గ్రామ న్యాయాలయాలు పెట్టాలని నిర్ణయం. దీనికి సంబంధించి సీఎస్‌ పంపిన ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం చేశారు. అయితే తర్వాత సీఎం గ్రామ న్యాయాలయాలపై ఏర్పాటుపై మరింతగా పరిశీలన చేద్దామన్నారు. సీఎం నిర్ణయం మేరకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్‌ ప్రకాష్‌ నిలిపేశారు. ఎంత ఖర్చు చేస్తున్నాం? ఎన్ని  పెడుతున్నా? అవి సరిపోతాయా? ఇంకా పెంచాలా? వద్దా? అన్నదానిపై న్యాయశాఖ కార్యదర్శితో సమావేశం పెట్టమని సీఎం ఆదేశించిన మీదటే ప్రవీణ్‌ ప్రకాష్‌ నిలిపేశారు.

పై వ్యవహారం అంతా సీఎం, సీఎస్‌ల సమక్షంలోనే జరిగింది. అయినా సరే, ఆఫైలును ఎందుకు పంపలేదంటూ సీఎస్‌ పట్టుబట్టడం… తీవ్రమైన ఉల్లంఘనగా ముఖ్యమంత్రి భావించారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. పై రెండు విషయాలను చూస్తే ఆ నిర్ణయాలేవీ సీఎస్‌కు తెలియకుండా తీసుకున్నవి కాదు. అంతేకాక, సీఎస్‌ సమక్షంలోనే ఆయనకు చెప్పే ముఖ్యమంత్రి తీసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పరస్పర విశ్వాసం ఉండాలనే ఆలోచనతో సీఎం దాపరికం లేకుండా నడుచుకున్నారు.

అదే సమయంలో తన సమక్షంలో, తనకు తెలిసీ ఈ నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగిగా సీఎం నిర్ణయాలను సీఎస్‌ కూడా పాటించాలి. అలా కాక సాంకేతిక అంశాలను చూపించి, ఆ నిర్ణయాలను సవాల్‌ చేసేలా నిలుపుదల చేయడం, సీఎంకు తనకు చెప్పినా సరే.. మళ్లీ అదే సాంకేతిక అంశాలను చూపించి ఏకంగా ముఖ్యమంత్రి కార్యదర్శికి షోకాజ్‌ నోటీసు జారీచేయడాన్ని, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అంగీకరించరు అంటూ ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ ఇచ్చింది.

Related posts

సస్పెండ్ చేస్తారా? ఎంత మందిని సస్పెండ్ చేస్తారు?

Satyam NEWS

జగన్ రెడ్డికి వణుకు పుట్టిస్తున్న సీ ఓవర్ సర్వే

Satyam NEWS

రాజ్‌ కందుకూరి చేతుల మీదుగా ‘నాతో నేను’ టీజర్‌ విడుదల

Bhavani

Leave a Comment