ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆయన ఢిల్లీ పర్యటనలో రెండు రోజుల పాటు పలువురు కేంద్రమంత్రులను కలిశారు.
కేంద్ర మంత్రులు అమిత్షా, పీయూష్ గోయల్, షెకావత్, జవదేకర్, ధర్మేంద్ర ప్రధాన్, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్లను సీఎం కలిశారు.
ఇదంతా ఓకే… మరి సంబంధిత మంత్రులు ఆయన ఢిల్లీ పర్యటనలో ఎందుకు పాల్గొనలేదు? సంబంధిత శాఖల మంత్రులు ముఖ్యమంత్రితో బాటు కేంద్రంలోని సంబంధిత మంత్రులను కలవడం ఆనవాయితీగా వస్తోంది.
అయితే ఈ సారి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే వెళ్లారు తప్ప మంత్రులు ఆయన ఢిల్లీ పర్యటనలో ఎక్కడా పాల్గొనలేదు.
వై ఎస్ జగన్ తో బాటు కొందరు పార్లమెంటు సభ్యులు ఉన్నారు కానీ వారు కొందరు కేంద్ర మంత్రులను కలిసినప్పుడే ఉన్నారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడు రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉండేవారు.
అయితే ఈ సారి ఆయన కూడా లేరు.
ముఖ్యమంత్రితో సంబంధిత మంత్రులు లేకుండా ఢిల్లీ పర్యటన చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సంబంధిత కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తమను లాంఛనప్రాయంగా కలిశారని ట్విట్లు చేయడంతో సంబంధిత మంత్రులు లేకపోవడం వల్లే ‘‘సీరియస్ నెస్’’ లోపించిందని అంటున్నారు.
అయితే ముఖ్యమంత్రి వెళ్లింది కేవలం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను కలిసేందుకేనని, అయితే ఎంతో సమయం ఎక్కువ ఉండటంతో మిగిలిన మంత్రులను కూడా కలిశారని అంటున్నారు.