తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. కొత్తగా చంద్రబాబా అవతారం ఎత్తి మంత్రించిన తాయత్తులు ఇస్తారంటని, ఆయన తాయత్తులకు అంత బలమే ఉంటే గత ఎన్నికల్లోనే గెలిచి ముఖ్యమంత్రి అయ్యేవాడని ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి విమర్శించారు. వైఎస్సార్సీపీకి ప్రజాదరణ మరింతగా పెరిగిందని, జగన్ నాయకత్వం కావాలని అంతా కోరుకుంటున్నారని, పంచాయతీ ఉప ఎన్నికలు ద్వారా తమ అభిప్రాయం వెల్లడి చేశారని తెలిపారు.
ఈ మేరకు విజయనగరంలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఉప ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులు సంపూర్ణ ఆధిక్యం సాధించారని చెప్పారు. జిల్లాతో పాటు, విజయనగరం నియోజకవర్గంలోనూ పూర్తి స్థాయిలో విజయం సాధించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పాలన, స్థానిక నాయకులు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల వల్లే ప్రజలు ఆదరించారని చెప్పారు. ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా, ఎటువంటి అవసరం వచ్చినా వైఎస్సార్ సీపీ నాయకులు అండగా ఉన్నారన్న ధైర్యం కలిగించగలిగామన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని నాలుగేళ్ల నాలుగు నెలల కాలంలో ప్రజల ఆదరణ పెరగడం చూసి ప్రతిపక్షాలకు దిక్కుతోచడం లేదన్నారు. రానున్న కాలంలో టీడీపీకి ఓటు అడిగే హక్కు లేదని స్పష్టం చేశారు. ఈ దఫానే ఆ పార్టీకి చివరి ఎన్నికలన్నారు.
పొత్తుల్లో సీఎం ఎవరు?
ప్రజలను మోసగించడమే చంద్రబాబు నైజమని, ఒంటరిగా ఎన్నికలకు వెళ్లే సత్తా లేకనే అన్ని పార్టీలకూ ప్రాధేయ పడుతున్నాడని కోలగట్ల విమర్శించారు. ఒకప్పుడు ప్రధాని మోదీనే తిట్టి, మరలా ఇప్పుడు అదే బీజేపీతో కలిసి వెళ్లాలని ఆరాటపడుతున్నారని అన్నారు. ఒకవైపు తానే ముఖ్యమంత్రిని అని పవన్.. మరోవైపు తమదే అధికారమని చంద్రబాబు, లోకేష్ లు అంటున్నారు.. అసలు వీరు కలిసి పోటీ చేస్తారో లేదో ప్రజలకైనా చెబుతారా అని ప్రశ్నించారు. లోకేష్ పాదయాత్రకు జనాదరణ లేకపోవడంతో చంద్రబాబు ఫ్రస్టెషన్లోకి వెళ్లిపోయారని, అందుకే ఈ వయసులోనూ ఊర్లు పట్టుకొని అబద్ధాలు ప్రచారం చేసుకుని తిరుగుతున్నాడని విమర్శించారు.
జగన్ పాలనపై విమర్శిస్తున్న చంద్రబాబు 2014- 2019 మధ్యకాలంలో అధికారంలో ఉండి ఏం చేశాడని ప్రశ్నించారు. విద్య, వైద్యం అందుబాటులో ఉన్నప్పుడే ప్రజల కనీస అవసరాలు తీరుతాయన్నది తమ ముఖ్యమంత్రి ఆలోచననన్నారు. నాడు- నేడుతో విద్యాలయాల అభివృద్ధి, రాష్ట్రంలో 17 వైద్య కళాశాలల ఏర్పాటు ఇందులో భాగమేనన్నారు. ఐదు వైద్య కళాశాలల్లో ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. విజయనగరం జిల్లాలోనూ వైద్య కళాశాల రావడం వల్ల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయని తెలిపారు. చంద్రబాబు హయాంలో ఇలాంటివి ఇప్పుడైనా జరిగాయా? అని ప్రశ్నించారు.
25న సీఎం జగన్ విజయనగరం రాక
మంత్రి బొత్స సత్యనారాయణ సూచనలతో జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, శాసనసభ్యులమంతా కలిసి జిల్లా అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నామని కోలగట్ల తెలిపారు. ఈనెల 25న సీఎం జగన్ చేతుల మీదుగా మెంటాడలో గిరిజన వర్శిటీకి శంకుస్థాపన చేపట్టనున్నట్లు చెప్పారు.
నూతనంగా ఎన్నికైన వారికి అభినందనలు
పంచాయతీ ఉప ఎన్నికల్లో పడాలపేట సర్పంచ్ గా ఎన్నికైన సువ్వాడ శ్రీదేవి, కొండకరకాం వార్డు మెంబర్ తుమ్మగంటి మంగలకు ఈ సందర్భంగా కోలగట్ల శాలువా కప్పి పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలియజేశారు. తమపై నమ్మకంతో ఓటేసి గెలిపించిన ప్రజలకు, విజయంలో కృషి చేసిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నడిపేన శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్పర్సన్ శశి భార్గవి, మండల నాయకులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.