ఏపీలో ఎస్సీలపై ,ఎస్టీలపై, మహిళలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలను విచారించేందుకు ఢిల్లీలో ఉన్న రాజ్యాంగ సంస్థలైన మానహ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ),ఎస్సీ,ఎస్టీ కమిషన్లు భయపడుతున్నాయా? లేక వారి కార్యాలయాలకు తాళాలు వేశారా? అని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య అనుమానం వ్యక్తం చేశారు. ఆదివారం మీడియాకు ప్రకటన విడుదల చేస్తూ తూర్పుగోదావరి జిల్లా కడియం పోలీస్ స్టేషన్లో దళిత యువకుడు వడ్డి వెంకట ప్రసాద్ పై సాక్షాత్తు పోలీస్ స్టేషన్లో ఎస్సై చేసిన దాష్ట్రీకంపై మండిపడ్డారు.
రాష్ట్రంలో లెక్కకు మించిన అమానవీయ, అనాగరిక సంఘటనలు జరుగుతున్నా, స్వయంగా తాను ఢిల్లీ వెళ్లి హెచ్ఆర్సీ, ఎస్సీ, ఎస్టీ చైర్మన్ లకు స్వయంగా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా, ఏపీ వైపు చూడకపోవటం పట్ల విచారం వ్యక్తం చేశారు. సీతా రామ పురం పోలీస్ స్టేషన్లో శిరోముండనం, కడియం పోలీస్ స్టేషన్లో మూత్రం పోస్తామని బెదిరించటం, ఒంగోలులో గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన, కాకినాడలో హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ, దర్శిలో మహిళను వివస్త్రను చేసి, కారం కొట్టి,కాళ్ళు చేతులు కట్టి వంటి సంఘటనలు మరో మణిపూర్ కు నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ,మహిళా కమిషన్ లు పూర్తిగా తాళాలు వేసుకొని తాడేపల్లి లోని ముఖ్యమంత్రి ఇంటికి మూడేళ్ళ క్రితమే కాపలా కోసం వెళ్ళారని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు రాబోవు ఎన్నికలలో మాలాంటి వాళ్ళు చట్ట సభలకు వెళ్లాల్సిన అవసరాన్ని గుర్తుకు తెస్తున్నాయని, దీనిని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు గుర్తించాల్సిన అవసరం ఉందని సూచించారు . చట్ట సభల దిశగా తమ కార్యాచరణ ఉంటుందని, వెనక్కి తగ్గ బోమని బాలకోటయ్య స్పష్టం చేశారు.