వాల్మీకి బోయలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని బిసి పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శనివారం వనపర్తిలో వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరానికి బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ హాజరై సంపూర్ణ మద్దతు తెలిపారు.
అంతకుముందు దీక్షా శిబిరం వద్ద వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా రాచాల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు చెల్లప్ప కమిటీని వేశారని, నేటికీ చెల్లప్ప కమిటీ నివేదికను బయటపెట్టకపోవటానికి కారణమేంటో రాష్ట్రంలోని వాల్మీకి బోయలకు సమాధానం చెప్పాలన్నారు.
వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించినట్లు గతంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పడం జరిగింది కానీ నేటికీ కార్యరూపం దాల్చలేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ వాదన ఇలా ఉంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పంపించిన తీర్మానం మాకు రాలేదని అంటుందని ఇలా అయితే వాల్మీకి బోయలకు న్యాయం ఎప్పుడు జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
1956కు ముందు వాల్మీకి బోయలు ఎస్టీ జాబితాలో ఉండేవారని రాజకీయ నాయకుల కక్షసాధింపు వలన వాల్మీకులు బీసీలుగా గుర్తించబడి వెనుకబాటుతనానికి గురయ్యారన్నారు.
ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చేంతవరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బీసీ పొలిటికల్ జేఏసీ అండగా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో బిసి పొలిటికల్ జేఏసీ జిల్లా నాయకులు భీమన్న నాయుడు, వాల్మీకి బోయ ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు టికే కుర్మన్న, రామ్మూర్తి నాయుడు, మండ్ల దేవన్న నాయుడు, వేణుగోపాల్, కొంకల వెంకట నారాయణ, ఉమ్మల్ల రాములు, బాలస్వామి, నీలస్వామి, గోపాల కృష్ణ, రవి, నాగవరం రాములు,స్వామి, అంజి పాల్గొన్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్