27.7 C
Hyderabad
April 30, 2024 08: 03 AM
Slider నిజామాబాద్

మాస్టర్ ప్లాన్ విషయంలో ఇద్దరూ తోడుదొంగలే

#katipalli

కామారెడ్డి కొత్త మాస్టర్ ప్లాన్ విషయంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇద్దరు తోడు దొంగలేనని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. నూతన మాస్టర్ ప్లాన్ తో భూములు కోల్పోతున్న రైతులకు మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ నిరసన కార్యక్రమం చేపట్టింది.

రైతుల భూములు కోల్పోయేలా రూపొందించిన మాస్టర్ ప్లాన్ నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వానికి, ఎమ్మెల్యే గంపకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల లబ్ది కోసమే మాస్టర్ ప్లాన్ రూపొందించారన్నారు. మాస్టర్ ప్లాన్ లో ఎమ్మెల్యే గంప గోవర్ధన్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబోద్దీన్, మున్సిపల్ వైస్ చైర్మన్ భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డిలకు భాగస్వామ్యం ఉందని ఆరోపించారు.

400 ఎకరాలను రియల్ ఎస్టేట్ చేయడానికి రైతుల భూములే దొరికాయా అని ప్రశ్నించారు. వ్యాపారం కోసం రైతుల భూములను ఇండస్ట్రియల్ జోన్ చేస్తున్న వారు సమాధానం చెప్పాలన్నారు. సర్వే నంబర్ 430 నుంచి 435 వరకు నాయకుల భూములు ఉన్నాయన్నారు. 35 సంవత్సరాలుగా రాజకీయంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ప్రస్తుత ఎమ్మెల్యే గంప గోవర్ధన్ లకు ఇందులో వ్యాపార భాగస్వామ్యం ఉందని ఆరోపించారు.

వీరి రాజకీయ నాటకంలో ప్రజలు బలవుతున్నారన్నారు. కొత్త మాస్టర్ ప్లాన్ లో డబ్బులు సంపాదించుకునేందుకు దిగజారిపోయారని విమర్శించారు. రైతులకు చెందిన అత్యంత ఖరీదైన భూములను రియల్ వ్యాపారం కోసం ఇండస్ట్రియల్ జోన్ గా మార్చడం దారుణమన్నారు. గంప గోవర్ధన్ కు దమ్ము ధైర్యం ఉంటే సెజ్ తీసుకురావాలని, భూసేకరణ చేపట్టి రైతులకు పరిహారం అందించిన తర్వాత పారిశ్రామిక వ్యాపార వేత్తలకు అమ్ముడు పోవాలన్నారు. ఇప్పటికే ఎంఎస్ఎన్ కంపెనీలో గంప అనుచరుడే లేబర్ కాంట్రాక్ట్ గా ఉన్నారని, ప్రతినెలా కమిషన్ తీసుకుంటున్నారన్నారు.

ఇంత డబ్బు సంపాదించుకుని ఏం చేసుకుంటావ్ అని నిలదీశారు. ఇప్పటికే కళాశాల కోసం 263 ఎకరాలు ఇస్తే అందులో 10 ఎకరాల్లో ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేయని ఎమ్మెల్యే ఇప్పుడెలా తెస్తారని ప్రశ్నించారు. ఒక్క ఇండస్ట్రీ తీసుకురాని మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే మాస్టర్ ప్లాన్ పేరుతో వ్యాపార భాగస్వామ్యం పొందారన్నారు. మాజీ మనీరి షబ్బీర్ ఆలీకి ఇందులో సంబంధం లేకపోతే స్పందించాలన్నారు.

నిన్నటి కార్యక్రమంలో షబ్బీర్ ఆలీకి అక్కడ భూమి లేదని, ఉన్న భూమి అమ్ముకున్నారని, మాస్టర్ ప్లాన్ తో షబ్బీర్ ఆలీకి సంబంధం లేదని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేసిన విషయంపై రమణారెడ్డి స్పందిస్తూ.. ఆ భూములు ఇప్పటికి షబ్బీర్ అలీ పేరుపైనే ఉన్నాయన్నారు. అక్కడ ఉన్న భూమి షబ్బీర్ అలీ అమ్మినప్పుడు పక్కనే ఉన్న 180 ఎకరాలు బడా నాయకులు తీసుకుంటే ఎందుకు తీసుకున్నారోనన్న అనుమానం రాకపోవడం శోచనీయమన్నారు.

మాజీ మంత్రిగా చేసిన వ్యక్తికి కనీస అవగాహన లేకపోవడం దారుణమన్నారు. మాస్టర్ ప్లాన్ విషయం ముందే తెలిసి తనకున్న భూమిని అమ్ముకుని నాయకులు కొనుగోలు చేసిన భూమిలో వాటా తీసుకున్నారని ఆరోపించారు. మాస్టర్ ప్లాన్ విషయం తెలిసే అమ్మితే ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 49 మంది కౌన్సిలర్లు, నలుగురు కో అప్షన్ సభ్యులు తీర్మాణం చేసారని మున్సిపల్ కమిషనర్ చెప్తున్నారని, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు రైతుల పక్షాన నిలబడకపోతే బయట తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు.

Related posts

తిరుపతి స్మార్ట్ సిటీ ప్రజలకు తప్పని “వర్షాకాలం తిప్పలు”

Satyam NEWS

ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి

Sub Editor

ఆక్స్ ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ లో అపశ్రుతి

Satyam NEWS

Leave a Comment