అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎమ్మెల్యేలను ఎంపిలను కలవకుండా బిగుసుకు కూర్చున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి వరుసగా తగులుతున్న ఎదురు దెబ్బలు వాస్తవంలోకి తెప్పించినట్లు కనిపిస్తున్నది. ఎమ్మెల్యేలను, ఎంపిలను కలిసేందుకు ఆయన నిర్ణయించుకున్నారట.
ఈ విషయాన్ని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను, ఎంపిలను ప్రత్యేకంగా కలిసేవారని ఆ విషయం కూడా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫాలో కావడం లేదని రఘురామకృష్ణంరాజు విమర్శించిన విషయం తెలిసిందే.
ఇంత కాలానికి తన సూచనను పరిగణనలోకి తీసుకున్నందుకు రఘురామకృష్ణంరాజు సంతోషం వ్యక్తం చేశారు. త్వరలో తనకు కూడా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సమయం ఇస్తారని భావిస్తున్నట్లు ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా మంది సొంత పార్టీ ఎమ్మెల్యేలను కలవలేదు. చాలా మంది ఆయన అప్పాయింట్ మెంటు అడిగి లేదనిపించుకున్నారు. కొందరు అప్పాయింట్ మెంటే అడగలేదు.
దాదాపు 60 నుంచి 70 శాతం మంది ఎమ్మెల్యేలు తొలి సారి ఎన్నికైన తర్వాత జరిగిన సమావేశం కాకుండా మళ్లీ కలవలేదు. దీనిపై వైఎస్ఆర్ సిపి లో తీవ్ర అసంతృప్తి కలిగించింది. ఎవరైనా సరే ఆయన పిలిస్తేనే వెళ్లాలి అనే నిబంధన ఉంది. ఇటీవలి కాలంలో కొందరు ఎమ్మెల్యేలు అసమ్మతి గళం కూడా వినిపించారు. ఈ కారణం వల్లనో ఏమో కానీ ఎమ్మెల్యేలను ఎంపిలను కలవాలని సిఎం నిర్ణయించుకున్నారు.