కోర్టు కేసుల నేపథ్యం, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ప్రకటన అమరావతిపై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలో మార్పు తెచ్చినట్లు కనిపిస్తున్నది. అమరావతిలో పెండింగ్ లో ఉన్న భవనాల నిర్మాణంపై ఆయన నేడు సమీక్ష నిర్వహించారు.
అమరావతి మెట్రోపాలిటిన్ ఏరియా డెవలప్ అథారిటీపై సీఎం వైయస్.జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ, సీఎస్ నీలం సాహ్ని, ఏఎంఆర్డీయే కమిషనర్ లక్ష్మీనరసింహం ఇతర అధికారులు పాల్గొన్నారు.
అమరావతిలో ప్రస్తుతం ఏయేదశల్లో నిర్మాణాలు ఉన్నాయో అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. వాటిని పూర్తిచేసే కార్యాచరణపై అధికారులతో సీఎం చర్చించారు. అదే విధంగా నిధుల సమీకరణకు ప్రణాళిక సిద్దంచేసుకోవాలని కూడా సీఎం అధికారులను కోరారు.
ఆర్థికశాఖ అధికారులతో కలిసి కూర్చుని ప్లాన్ చేసుకోవాలని సీఎం సూచించారు. అదే విధంగా హాపీ నెస్ట్ బిల్డింగులను పూర్తిచేయాలని కూడా సీఎం ఆదేశం ఇచ్చారు. అతి పెద్ద రాష్ట్ర మైన ఉత్తర ప్రదేశ్ కే ఒక రాజధాని ఉంటే ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఎందుకు అని రామ్ మాధవ్ ప్రశ్నించారు.
వైసీపీలో కలకలం రేపిన రామ్ మాధవ్ ప్రకటన
రాజధాని విషయంలో తమకు సంబంధం లేదని కేంద్రం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సంతోషించింది. కేంద్ర జోక్యం చేసుకోకపోతే ఇక మూడు రాజధానులకు అడ్డే లేదని ముఖ్యమంత్రి జగన్ అనుకున్నారు.
ఈ నేపథ్యంలో రామ్ మాధవ్ వ్యాఖ్యలు ఒక్క సారిగా బిజెపి ఏ విధంగా మాట్లాడుతున్నదో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. న్యాయస్థానాలలో అఫిడవిట్లు సమర్పించాల్సిన అనివార్య పరిస్థితులు కూడా ఉండటంతో అమరావతిపై సమీక్ష జరపాల్సి వచ్చింది.
రైతులకు సంబంధించిన అంశాలపై కోర్టులకు సమాధానం చెప్పడంలో ఎలాంటి పొరబాటు జరిగినా తమ ప్రణాళికకు విఘాతం కలిగే అకాశం ఉందని అధికార వైసిపి అనుకుంటుంన్నది. అందుకే సమీక్ష జరిపి తదుపరి చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించారని భావిస్తున్నారు.
ఎంతకూ లొంగని రాజధాని రైతులు
అమరావతి రైతులను వైసీపీకి చెందిన ఒక ప్రముఖుడు, అధికార పదవిలో ఉన్న వ్యక్తి చర్చలకు పిలిచారని కూడా తెలిసిందే. అమరావతి రైతులకు ఆయన పలురకాల తాయిలాలు ఇవ్వచూపారని కూడా అంటున్నారు. ఆ ప్రాంతంలో ఆగ్రో బేస్ డ్ పరిశ్రమలు పెడతామని కూడా ఆయన రైతులకు చెప్పినట్లు తెలిసింది.
అయితే రాజధానిగా అమరావతిని కొనసాగించడం తప్ప తాము ఎలాంటి తాయిలాలకు లొంగేది లేదని వారు కరాఖండిగా చెప్పారు.
ఆ తర్వాత రైతులు కూడా చర్చలకు ఎలాంటి మొగ్గు చూపడం లేదు. ఈ నేపథ్యంలో అమరావతిని అభివృద్ధి పరిచే ప్రణాళికలు రూపొందించి క్లిష్ట పరిస్థితులను నుంచి బయటపడాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది.