పంచాయితీ ఎన్నికలలో ఎక్కడ ఎటువంటి ఆటంకాలు ఎదురైనా, వైసిపి నాయకులు ఘర్షణలకు దిగినా ఫొటోలు, వీడియో సాక్ష్యాధారాలను సేకరించాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాస రెడ్డి సూచించారు.
కడప జిల్లా రాజంపేట పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోని, పంచాయతీల నుండి స్థానిక ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రతి పంచాయతీ నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేస్తారని ఆయన తెలిపారు.
జగన్ మెహన్ రెడ్డి ఉన్మాద పాలనపై ప్రజలలో వ్యతిరేకత ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘంపై వైసీపీ దాడి గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నదని ఆయన తెలిపారు.
గత సంవత్సరం స్థానిక ఎన్నికల్లో వైసీపీ హింస, విధ్వంసాలపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయన అన్నారు. గత ఏడాది మార్చిలో జరిగిన స్థానిక ఎన్నికల్లో 25% బలవంతపు ఏకగ్రీవాలే.. దాడులు, దౌర్జన్యాలతో భయోత్పాతం సృష్టించారని ఆయన అన్నారు.
సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించినా వైసిపి నాయకులు ఏమాత్రం సిగ్గుపడటం లేదని ఆయన అన్నారు. అన్ని గ్రామాల్లో ధైర్యంగా, స్వేచ్ఛగా నామినేషన్లు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగితే వైసిపి ఓటమి ఖాయమని ఆయన అన్నారు.
పోటీకి కావాల్సిన సర్టిఫికెట్లను అభ్యర్ధులంతా సిద్దం చేసుకోవాలి. కులధ్రువీకరణ పత్రం, నోడ్యూస్ సర్టిఫికెట్, నేటివిటి సర్టిఫికెట్ లు అన్నీ సిద్దం చేసుకోవాలి. ఆన్ లైన్ లో నో డ్యూస్ సర్టిఫికెట్లు పొందేలా వీలు కల్పించాలని కోరుతూ ఎన్నికల సంఘానికి ఇప్పటికే వినతి పంపాం అని ఆయన అన్నారు.
నామినేషన్ వేయగానే స్థానిక నియోజకవర్గం ఇంఛార్జీలకు సమాచారం ఇవ్వాలి, ప్రతి చోటా డమ్మీ అభ్యర్ధులను కూడా నిలబెట్టాలని, ఎక్కడైనా ఎన్నికల విధుల నిర్వహణలో నిర్లక్ష్యం చేసినా, సహాయ నిరాకరణ చేసినా సదరు ఉద్యోగులపై వెంటనే ఫిర్యాదులు ఇవ్వాలని సూచించారు.