వేములవాడ రాజన్న ఆలయంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉందన్న ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన ఆలయం మొత్తం పరిశీలించి ఆలయ పరిసరాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కలెక్టర్ తనిఖీ సమయంలో ఆలయ పరిసరాల్లో చెత్త పేరుకొని ఉండటాన్ని గమనించిన కలెక్టర్ కృష్ణ భాస్కర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
కార్యనిర్వాహణాధికారి కృష్ణవేణిని పిలిచి తీవ్రంగా మందలించారు. వేలాది భక్తులు వచ్చే ఈ సీజన్ లో ఆలయ పరిశుభ్రతపై శ్రద్ధ తీసుకోకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయంలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేదంటూ భక్తుల నుంచి ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల నుంచి అధికంగా భక్తులు వస్తున్నారని ఆయన అన్నారు.
వేములవాడ వచ్చి అటు నుంచి మేడారం వెళ్లడం భక్తులకు ఆనవాయితీగా వస్తున్నది. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆలయం లోపల, పరిసరాలలో లో నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని అధికారులకు హుకుం జారీ చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ లో అలసత్వం ప్రదర్శిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. ఆకస్మిక తనిఖీ లో కలెక్టర్ వెంట వేములవాడ మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు.