టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అల్జీమర్ వ్యాధితో బాధపడుతున్నట్లు గా కనిపిస్తున్నదని, ఈ క్రమంలో ఆయన ఏం మాట్లాడుతున్నారో ఎవ్వరికీ అర్ధం కావటం లేదని విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జేడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు జేడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటమి పాలైన తరువాత అశోక్ గజపతి, సుజయ్ లు ప్రజల్లో ఎప్పుడు కనిపించలేదని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఎన్ టి అర్ గుర్తుకువస్తారని, ఎన్ టి ఆర్ పేరు వాడకపోతే మీకు ఆదరణ దొరకదని భయంతోనే వాడుకుంటున్నారన్నారు.
అశోక్ గజపతి రాజు నీతి, నిజాయితీ ఏంటో చెప్పాలని, చంద్రబాబు మాయమాటలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కోర్టుల్లో 150 కేసులు ఉంటే ఎయిర్ పోర్ట్ కు శంఖుస్థాపన ఎలా చేస్తారని ప్రశ్నించారు. రైతుల ధాన్యం కొనుగోలు చేయలేదని ఏ ఒక్క రైతు అయినా చెప్పాడా అంటూ ప్రశ్నించారు.కరువు, బాబు కవల పిల్లలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎద్దేవా చేశారు.మీ హయాంలో రైతులు ఎక్కడైనా బాగు పడ్డారా అని ప్రశ్నించారు. సైకిల్ పోవాలి అని చంద్రబాబు కోరుకున్న కోరిక ప్రజలు తప్పకుండా నెరవేరుస్తారని ఆయన అన్నారు. నా పై చంద్రబాబు చేసిన ఆరోపణలు నిరూపించాలని డిమాండ్ చేశారు. జరగబోయే ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఎన్నికలేనని స్పష్టం చేశారు.