ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ సకాలంలో పరిష్కరించాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ప్రజావాణి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్, అదనపు కలెక్టర్ రాజేష్ కుమార్ తో కలిసి ప్రజల నుండి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు.
జిల్లా నలుమూలల నుండి వచ్చిన 39 మంది వివిధ సమస్యలపై అర్జీలను కలెక్టర్కు అందజేశారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే పరిష్కరించేలా చొరవ చూపాలన్నారు. ప్రజావాణి వినతులపై తీసుకున్న చర్యలపై ఫిర్యాదుదారులకు తప్పనిసరిగా సమాచారం తెలియజేయాలని సూచించారు. వచ్చే సోమవారం నాటికి శాఖల వారీగా పెండింగ్ ఫిర్యాదుల వివరాలను అందజేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
రానున్న వారంలో శాఖల వారీగా పరిష్కారం కాని వినతుల పై సమీక్షలు ఉంటాయన్నారు. శాఖల వారీగా ప్రజావాణి పట్టికను ఏర్పాటుచేసి వచ్చిన ఫిర్యాదులు, పరిష్కారం అయినా ఫిర్యాదులు, పరిష్కారం కాకపోతే అందుకు గల కారణాలను వెల్లడించే లా ప్రజావాణి ఫిర్యాదుల పట్టిక ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్