రాజ్యాంగ పదవిలో ఉన్న తనపై ఎన్నికలు జరుగుతున్నసమయంలో అత్యంత నీచమైన పదజాలంలో విమర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కు లేఖ రాశారు.
సజ్జల రామకృష్ణారెడ్డితో బాటు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ లు లక్ష్మణరేఖ దాటి, తనపై విమర్శలు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. తనపై మంత్రుల వ్యక్తిగత విమర్శలు కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని ఆయన గవర్నర్ కు గుర్తు చేశారు.
సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ పార్టీ ఆఫీసు నుంచి తనపై విమర్శలు చేస్తున్నారని, ప్రభుత్వ పదవిలో ఉంటూ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు.
సుప్రీంకోర్టులో కేవియట్ వేసిన తనకు వ్యతిరేకంగా సజ్జల వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన అన్నారు. సజ్జల వ్యాఖ్యలపై తదుపరి చర్యలకు అటార్నీ జనరల్ సలహా తీసుకోవాలని గవర్నర్ను ఆయన కోరారు.