పోటీ ప్రపంచంలో కంప్యూటర్ పరిజ్ఞానం చాలా అవసరమని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం కొణిజేర్ల మండలం తనికెళ్ళ జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్ఆర్ఐ ఫౌండేషన్, తానా సహకారంతో దాతలు తుళ్లూరు లెనిన్ చౌదరి, వెంకట జిల్లెళ్ళమూడిచే ఏర్పాటుచేసిన కంప్యూటర్ ల్యాబ్ ను కలెక్టర్ ప్రారంభించారు. దాతలు పాఠశాలకు 10 కంప్యూటర్లు, 5 ఐరన్ గేట్లు, 9 ఐరన్ కిటికీలు, సైకిల్ స్టాండ్ ను సమకూర్చారని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విద్యార్థుల నుద్దేశించి మాట్లాడుతూ, కంప్యూటర్ ల్యాబ్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కంప్యూటర్ విద్య ఆవశ్యకత ను గుర్తించి, ఎన్ఆర్ఐ ఫౌండేషన్ వారు పుట్టిన గ్రామానికి సేవ చేయాలనే తలంపుతో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటుకు సహాయం చేశారన్నారు.
ప్రభుత్వం చే పాఠశాలలో సౌకర్యాల లోటు ఉండకూడదని, మన ఊరు-మన బడి కార్యక్రమం క్రింద పాఠశాలకు రూ. 30 లక్షలు వెచ్చించి, డైనింగ్ హాల్, కాంపౌండ్ వాల్, త్రాగునీరు, టాయిలెట్ బ్లాక్, పాఠశాల మరమ్మతులు చేయించినట్లు ఆయన అన్నారు. ప్రభుత్వం చే అన్ని సౌకర్యాలు కల్పించి, ఉపాధ్యాయుల నియామకం చేసినందున, విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని ఆయన తెలిపారు.
మంచిగా చదువుకొని, ఉత్తమ పౌరులుగా తయారవ్వాలన్నారు. వారానికి ఒక కంప్యూటర్ పీరియడ్ నిర్వహించాలని ఆయన అన్నారు. కంప్యూటర్ ట్యూటర్ ని ఒక సంవత్సరం పాటు దాతలే ఏర్పాటుచేస్తారని ఆయన తెలిపారు. పూర్తి స్థాయిలో విద్యార్థులు ఉపయోగించుకొనేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా డిప్లొమా చదివే చాణిక్య కు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ చే సమకూర్చిన ల్యాప్ టాప్ ను కలెక్టర్ చేతుల మీదుగా అందించారు.