ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరిలో జగన్నాథ రథయాత్ర కు రంగం సిద్ధం అయింది. ప్రతీ సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం రెండో రోజున ఈ యాత్రను ప్రారంభిస్తారు. గత మూడు సంవత్సరాలుగా కరోనా కారణంగా ఈ యాత్రకు ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. ఈ సారి కరోనా లేకపోవడంతో రథయాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సనాతన ధర్మంలో జగన్నాథుడిని శ్రీమహా విష్ణువు అవతారంగా భావించి పూజిస్తారు. జగన్నాథుడు అంటే జగత్తు మొత్తానికి నాథుడు లేదా విశ్వానికి అధిపతి అని అర్ధం. పూరీ జగన్నాథుని రథయాత్రలో స్వామి తో బాటు సోదరుడు బలభద్ర, సోదరి సుభద్రతో కలిసి రథంలో కూర్చుని విహారానికి వెళ్లారు.
పురాణాల ప్రకారం జగన్నాథ రథయాత్రలో జగన్నాథ స్వామి రథంలో తన అత్తవారిల్లు గుండిచాకు వెళ్తారు. ఇప్పుడు గుండిచా ఆలయాన్ని జగన్నాథుని అత్తవారి ఇల్లుగా భావిస్తున్నారు. అత్తవారింట్లో జగన్నాథుడు… తన సోదరుడు బలభద్ర, సోదరి సుభద్రతో వారంపాటూ ఉంటారు. అక్కడ ఆతిథ్యం స్వీకరిస్తారు. శ్రీకృష్ణుడు తన మేనత్త ఇంట్లో తన తోబుట్టువులతో కలిసి ఆతిథ్యం స్వీకరిస్తూ విందును ఆరగిస్తారని రకరకాల వంటకాలు రుచి చూస్తారని భక్తులు చెబుతుంటారు.
విందు తర్వాత స్వామి 7 రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు. దీనిని అజ్ఞాతవాసంగా పిలుస్తారు. ఆ తర్వాత జగన్నాథ స్వామి భక్తులకు దర్శనం ఇస్తారని చెబుతారు. పురాణాల ప్రకారం పూరీ రథయాత్రలో పాల్గొన్న భక్తులు 100 యాగాలకు సమానమైన పుణ్యఫలాల్ని పొందుతారని ప్రతీతి. అందుకే ఈ రథయాత్రలో పాలు పంచుకునేందుకూ, రథాలను లాగేందుకూ, భారత్తోపాటూ ప్రపంచంలోని చాలా దేశాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ యాత్ర పది రోజులు సాగుతుంది.