ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఇంటర్, పదో తరగతి ఫలితాలలో అత్యున్నత మార్కులు సాధించి టాపర్లుగా నిలిచిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అభినందించారు. ఐడిఓసి లోని సమావేశ మందిరంలో జిల్లాలోని గురుకులాలలో చదువుకొని అత్యున్నత మార్కులు సాధించిన టాపర్లను కలెక్టర్ అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోటీ ప్రపంచంలో ఎక్కడ, ఏ స్థాయిలో ఉన్నామో చూపించుకోవడానికి పరీక్షలు ఒక మంచి అవకాశం కల్పిస్తాయన్నారు. ఆడ, మగ తేడా చూడకూడదని, అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని ఆయన తెలిపారు. తల్లిదండ్రుల సహకారంతో మంచి స్థాయికి చేరుకుని, సమాజానికి స్ఫూర్తిగా ఉంటారన్నారు.
రోల్ మోడల్ గా తయారయి, ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి చేరాలన్నారు. నీట్ అర్హత పరీక్ష ఎలా వ్రాసారని, జెఇఇ, ఎంసెట్ పరీక్షలో కూడా రాణించాలన్నారు. పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణ అందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా కలెక్టర్, కెజిబివి లలో రాష్ట్రంలో టాపర్ గా నిలిచిన చింతకాని కెజిబివి విద్యార్థిని ఆదిలక్ష్మి, కెజిబివిలో 3వ ర్యాంకర్ గా నిలిచిన కెజిబివి ఖమ్మం రూరల్ విద్యార్థిని ప్రస్తుతి, డా. బీఆర్.
అంబేద్కర్ జూనియర్ కళాశాలలో 990 మార్కులు పొందిన రవళి, 984 మార్కులు పొందిన మేఘన, బిసి సంక్షేమ గురుకులాల్లో 988 మార్కులు పొందిన లావణ్య, లక్ష్మణ్ రావు, మైనారిటీ గురుకులాల్లో 975 మార్కులు పొందిన కావ్య, రంజాన్ భాషా, సమీరాలను కలెక్టర్ అభినందించారు