కేసీఆర్, కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆస్తులను ప్రకటించిన తర్వాతనే ఎల్.ఆర్.యస్ ను అమలు చేయాలని రాష్ట్ర కాంగ్రేస్ పార్టీ అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం కేంద్రంలోని పి.సి.సి ప్రసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో అల్లం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నూతన రెవెన్యూ చట్టం పేరుతో వి.ఆర్.ఓ వ్యవస్థను రద్దు చేయడం హేయమైన చర్య అని, వి.ఆర్.ఓ లను దొంగలుగా చిత్రీకరించి యం.ఆర్.ఓ లు అవినీతి జలగలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
ఎల్. ఆర్.యస్ చట్టము పేద ప్రజానీకం నడ్డి విరుస్తుందని, ఎప్పుడో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసిన భూములకు తిరిగి ఎల్.ఆర్.యస్ కట్టమనడం దోపిడీ చేయడమే అన్నారు. ఒక కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు ఒక్కొక్క గది పంచుకుంటే వాటికి ఎల్.ఆర్.యస్ కట్టమని అనడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు.
అవినీతిలో కూరుకుపోయిన కేసీఆర్ ప్రభుత్వం
కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకొని పోయిందన్నారు. వచ్చే రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడం ఖాయం అని జ్యోస్యం చెప్పారు.
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో ఆరు వేల ఎకరాలకు గాను 12 వేల ఎకరాలకు పాసుబుక్ లు ఇచ్చిన తాశీల్దార్ లను కేవలం సస్పెండ్ మాత్రమే చేసి చేతులు దులుపుకున్నారని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఈ విషయంపై ప్రస్తావించిన ముఖ్యమంత్రి ఎందుకు వారిపై క్రిమినల్ కేసులు పెట్టలేదని ప్రశ్నించారు.
వారి వెనుక ఉన్న సూత్రధారులు ఎవరని విచారణ ఎందుకు జరపడం లేదని అన్నారు. హుజూర్ నగర్ మున్సిపాల్టీ అంత అవినీతిలో కూరుకొని పోయిందని,ప్రభుత్వం ఆస్తులను ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఆస్తులను కాపాడడం ప్రతి పౌరుని బాధ్యత అని అందరు కలసికట్టుగా పోరాడాలని అన్నారు.కేసీఆర్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలుపై కాంగ్రేస్ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.