టీటీడీ, నగరపాలక సంస్థ, తుడా, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయ లోపం తిరుపతి ప్రజలకు శాపంగా మారిందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కపిలతీర్థం మాల్వాడి గుండం ద్వారా వచ్చే వర్షపు నీరు ప్రవహించే కాలువలు నిండి రోడ్లపై పొంగి పొర్లుతూ లీలామహల్, మధురా నగర్, లక్ష్మిపురం, ఎం.అర్ పల్లి పరిసర ప్రాంతాలలోని కాలనీలలోని ఇండ్లలోకి చేరుతున్నాయని ఆయన అన్నారు. అదే విధంగా శేషాచలం కొండల్లో నుంచి వచ్చే వర్షపు నీటిలో విషసర్పాలు ఉంటాయని, వాటితో ప్రమాదాలు జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన కోరారు.
తిరుపతిలో గతంలో ఉన్న చెరువులు దాదాపుగా ఆక్రమణలకు గురైన కారణంగా వర్షాలు పడినప్పుడు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయని ఆయన తెలిపారు. భవిష్యత్ తరాల వారికోసం ఉన్న చెరువులను అయినా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం,ప్రజలపై ఉందని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. తిరుపతి అభివృద్ధికి “టాస్క్ ఫోర్స్” అవశ్యకత ఎంతైనా అవసరం అని ఆయన అన్నారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని ప్రణాళికలు రూపొందించి వర్షాకాలంలో నగర ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని ఆయన కోరారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి స్మార్ట్ సిటీ లో పర్యటించి జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి వర్షాల కారణంగా నష్టపోయిన వరద బాధితులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకునే ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుపతి నగరంలో వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతులు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని ఆయన కోరారు.