సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో గుర్తుతెలియని దుండగుల చేతిలో గాయపడిన సీనియర్ జర్నలిస్టు ఎలక సైదులు గౌడ్ ని వారి ఇంటి వద్ద హుజుర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు.
జర్నలిస్టుపై జరిగిన దాడిని ఖండిస్తూ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రశ్నించే గొంతుల మీద,జర్నలిస్టుల మీద భౌతిక దాడులు పెరిగాయని, ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్దతి కాదని అన్నారు.
అనంతరం పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిలో గల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలియజేసి,సీనియర్ జర్నలిస్టు ఎలక సైదులు గౌడ్ పై దాడికి పాల్పడిన దుండగులను వెంటనే గుర్తించి వారిని అరెస్టు చేయాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కి ఫిర్యాదు చేశారు.
ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా పిలువబడే జర్నలిస్టు వ్యవస్థపై ఇలాంటి దాడులు చేయటం పిరికిపందల చర్య అని అభివర్ణించారు. ఈ విషయమై మేధావులు, పాత్రికేయులు, విద్యావంతులు ఇట్టి విషయాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని, లేకపోతే ఈ రోజు ఒకరి మీద జరిగితే మున్ముందు ఈ విష సంస్కృతి పెరిగే అవకాశం ఉందని, కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సాముల శివారెడ్డి, టి పి సి సి జనరల్ సెక్రటరీ ఎండి అజీజ్ పాషా, మాజీ జెడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు, బాచిమంచి గిరిబాబు, జక్కుల మల్లయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు కస్తాల శ్రవణ్ కుమార్, ములకలపల్లి గోపి, కుక్క డప్పు మహేష్, పోతుల జ్ఞానయ్య, బెంజిమెన్, కంకణాల పుల్లయ్య, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.