రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి మాదిగలకు కనీసం 14 ఎమ్మెల్యే టిక్కెట్లను కేటాయించాలని తెలంగాణ దండోరా డిమాండ్ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 19 నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వుడు స్థానాలు ఉన్నాయి. ఉత్తర తెలంగాణలో, దక్షిణ తెలంగాణలో కూడా మాదిగ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నందున తమకు జనాభా నిష్పత్తి ప్రకారం 14 సీట్లు కేటాయించాలని తెలంగాణ దండోరా నాగర్ కర్నూల్ జిల్లా గౌరవ అధ్యక్షుడు డి కె మాదిగ కోరారు.
తెలంగాణ దండోరా కొల్లాపూర్ నియోజక వర్గ తాలూకా అధ్యక్షుడు మల్లెల వెంకటస్వామి మాట్లాడుతూ 19 రిజర్వుడు స్థానాల్లో అన్ని స్థానాలు మాల సామాజిక వర్గానికి కేటాయించి, చిట్టచివరికి కొన్ని స్థానాలు మాదిగ సామాజిక వర్గానికి కేటాయించడం అన్యాయమని అన్నారు.
రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా 14 ఎమ్మెల్యే సీట్లు మాదిగలకు కేటాయించాలని, లేనియెడల తెలంగాణ దండోరా ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ దండోరా గ్రామ అధ్యక్షులు బంకలి శేఖర్ మాదిగ తెలంగాణ దండోరా నాయకులు పాల్గొన్నారు.