ఏమైందో ఏమో కానీ ఒక పోలీసు కానిస్టేబుల్ తన భార్యను ఆమె కుటుంబం మొత్తాన్ని కాల్చి చంపాడు. అత్త, బావమరిది, బావమరిది భార్య మరణించగా 10 ఏళ్ల అతని కుమార్తె మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. పంజాబ్ లోని మోగ పోలీస్ కు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మోగ లోని ధర్మకోట్ సబ్ డివిజన్ లోని జలాల్ పూర్ గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
మరణించిన వారిని రాజ్ విందర్ కౌర్ (భార్య), జస్కరన్ సింగ్ (బావమరిది), ఇన్దేర్జిత్ కౌర్ (బావమరిది భార్య), సుఖ్విందర్ కౌర్ (అత్త) గా గుర్తించామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కానిస్టేబుల్ అయిన కుల్విందర్ సింగ్ ను ఇక్కడి పోలీస్ లైన్స్ లో పోస్ట్ చేశారు. అతను యాంటీ అల్లరీ స్క్వాడ్ లో ఉండి స్థానిక పోలీసులకు చెందిన టియర్ గ్యాస్ యూనిట్ కు హెడ్ గా ఉన్నాడు. నేరం చేసిన తర్వాత అతను పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
అతని సర్వీస్ రైఫిల్ ను కూడా పోలీసులు రికవరీ చేశారు. సింగ్ కు తన భార్య, ఆమె కుటుంబంతో వివాదం ఉందని ప్రాథమిక పరిశోధనలు వెల్లడించాయి. ఇది ఆయన రెండో వివాహం. తన భార్య, కూతురు కొన్ని రోజుల క్రితం జలాల్ పూర్ గ్రామంలో తన పుట్టింటికి ఇంటికి వెళ్లారని, సింగ్ అక్కడకు వెళ్లి కుటుంబీకుల పై కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు.
పోలీసులు మృతదేహాలను ఇక్కడి జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం పరీక్ష కోసం పంపించారు. ఇంకా పరిశోధనలు పురోగతిలో ఉన్నాయని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కాల్పులకు ఉపయోగించిన ఏకే-47 ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.