పౌరసత్వ చట్టం, ఆర్టికల్ 370 పై పునరాలోచన అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. తన ప్రభుత్వం వాటిని యధాతథంగా అమలు చేసేందుకు కృతనిశ్చయంతో ఉందని ఆయన అన్నారు. అన్ని వైపుల నుండి ఒత్తిడి ఉన్నప్పటికీ వాటి అమలులో ఎలాంటి మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాశిలో రూ.1254 కోట్లతో అమలు చేయబోతున్న 50 కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామ జన్మ భూమిలో దేవాలయం నిర్మించేందుకు ఇప్పటికే ట్రస్టును ఏర్పాటు చేశామని త్వరలో మరింత ముందుకు వెళతామని ఆయన అన్నారు. జాతి ప్రయోజనాల విషయంలో ఈ నిర్ణయాలు అవసరమేనని ప్రధాని మోడీ అన్నారు. అన్ని వైపుల నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ, ఈ నిర్ణయాల మీద మేం దృఢంగా ఉన్నాం అని మోడీ చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో CAA వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్న దృష్ట్యా ప్రధాని ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకున్నది.