ఐటీ రిటర్న్ లు ఉన్నాయనే సాకుతో పేదోళ్ల బియ్యం కార్డు పీకేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పారిశ్రామిక విధానాన్ని నమ్మేదెవరో ఆయనే చెప్పాలని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం విమర్శించారు.విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ అధ్యక్షుడు నేతి మహేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 కార్యక్రమం ప్రభుత్వం ఏర్పాటు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
హైదరాబాద్ లోని భారతీ సిమెంట్ ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎందుకు తేలేకపోయారో జవాబు చెప్పాలన్నారు.అమరరాజా బ్యాటరీ ని పెట్టిన ఇబ్బందులు తెలిసిన పారిశ్రామిక వేత్తలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే అవకాశం లేదన్నారు. అన్నీ అవకాశాలు ఉన్నా ప్రభుత్వ వైఫల్యం వల్ల పారిశ్రామిక విధానం దెబ్బతిందని తెలిపారు.మొక్కుబడిగా జరిగే సదస్సులో పారిశ్రామిక వేత్తలు కూడా మొక్కుబడిగా పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు.
రెండురోజుల తరువాత ఎన్ని ఒప్పందాలు జరిగాయో, ఎన్ని కంపెనీలు వస్తాయో తెలుస్తుంది అని తెలిపారు. రివర్స్ టెండరింగ్ భయంతో ఇన్వెస్టర్స్ భయపడుతున్నారు అని రావుసుబ్రహ్మణ్యం తెలిపారు.ఐటీ రిటర్న్ ఉంటే చిరు వ్యాపారులు వ్యాపారవేత్తలు గా మారే వారని, అలాంటిది వారిని 5 వేలకు పని చేసే వాలంటీర్లు గా జగన్ మార్చారని, యువత ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని విమర్శించారు.