చట్ట ప్రకారం కాకుండా రాజకీయ అవసరాల కోసం పని చేస్తే ఐఏఎస్ అధికారులకు చిక్కులు తప్పవు అనే సంఘటనలు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయి.
దాంతో ఏపీ సివిల్ సర్వీస్ అధికారులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కోర్టు ధిక్కరణ కేసుల్లో నోటీసులు అందుకుని కోర్టుల్లో హాజరు వేయించుకుని విధులకు వెళ్తున్నారు.
ఒక్కో సారి శిక్షకు గురవుతున్నారు. తాజాగా చిరంజీవి చౌదరి, గిరిజా శంకర్ అనే సివిల్ సర్వీస్ అధికారులకు కోర్టు శిక్ష విధించింది.
కోర్టు సమయం ముగిసే వరకూ కోర్టులోనే ఉండాలని ఆదేశించింది. ఇదేమీ పెద్ద శిక్ష కాదు కానీ… పరువుకు మాత్రం భంగమే. అలాగే… వారి సర్వీస్ రికార్డుల్లోనూ ఈ అంశం నమోదవుతుంది.
భవిష్యత్లో వారి ప్రమోషన్లకు దీనివల్ల ఇబ్బంది ఏర్పడుతుంది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయకపోవడమే వీరిని హైకోర్టు శిక్షించడానికి కారణం.
వీరు శిక్షలో భాగంగా కోర్టులో ఉన్న సమయంలోనే… చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ కూడా హైకోర్టుకు వచ్చారు. ఈయన వచ్చింది .. వీరిని సానుభూతితో పరామర్శించడానికి కాదు.
ఆయన కూడా కోర్టు ధిక్కరణ కేసులో హాజరవడానికి వచ్చారు. ఆ కేసులో అఫిడవిట్ సమర్పించేందుకు సమయం అడిగి… అనుమతించడంతో వెళ్లిపోయారు.
ఇలాంటి కోర్టు ధిక్కరణ కేసులు సీఎస్ దగ్గర్నుంచి అనేక మంది సివిల్ సర్వీస్ అధికారులపై పడ్డాయి.
ఐఏఎస్ ప్రవీణ్ కుమార్, ఐపీఎస్ సునీల్ కుమార్లపై ఇప్పటికే హైకోర్టు కేసులు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది.
వారంతా కోర్టుల చుట్టూ తిరగడమే కాదు భవిష్యత్లో కూడా తీవ్ర ఇబ్బందులు పడనున్నారు. వైసీపీ ప్రభుత్వంలో అనేక మంది సివిల్ సర్వీస్ అధికారులపై కోర్టు ధిక్కరణ పిటిషన్లు పడ్డాయి.
ప్రభుత్వం చెప్పినట్లుగా చేస్తు్న్న ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు చట్టాలు.. రాజ్యాంగాన్ని కూడా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ పరిణామాలతో అధికారవర్గాల్లో అలజడి రేగుతోంది.
అయితే పోస్టింగ్ల కోసం కొంత మంది.. చట్టాలను ఉల్లంఘించి ప్రభుత్వానికి సేవ చేయడానికి వెనుకాడటం లేదు.
ఈ క్రమంలో వివాదాలు వస్తున్నా వెనక్కి తగ్గడం లేదు. రాజకీయ నాయకులు చెప్పిందే రాజ్యాంగం.. చట్టం అన్నట్లుగా వ్యవహరిస్తూండటంతో అధికారులు కోర్టుల పాలవుతున్నారు.