కరోనా లాక్ డౌన్ నిబంధనలు లేకపోతే డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆందోళన చేసి ఉండేవాడినని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ అన్నారు. డాక్టర్ సుధాకర్ కేసు ఒక పెట్టీ కేసు (చిల్లర కేసు) అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇలాంటి చిల్లర కేసులపై సీబీఐ విచారణ వేయడంపై యావత్ రాష్ట్రం విస్తుపోయిందన్నారు. కోర్టు తీర్పులను ప్రశ్నించకూడదు కానీ ఇలాంటి తీర్పులతో న్యాయస్థానాలపై నమ్మకం పోతోందని ఆయన విమర్శించారు. కరోనా లేకపోతే హైకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా ఆందోళన చేసి ఉండేవాడినని ఆయన వ్యాఖ్యానించారు.
చిన్న చిన్న కేసులకు కూడా సీబీఐ విచారణ వేసుకుంటూ పోతే ప్రతి పొలీస్స్టేషన్కు అనుబంధంగా కేంద్ర ప్రభుత్వం సీబీఐ ఆఫీసులు పెట్టాల్సి ఉంటుంది అంటూ ఆమంచి కృష్ణ మోహన్ అన్నారు.