దుర్మార్గమైన విదేశీ అన్యమతం గిరిజన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మత మార్పిడులకు పాల్పడుతోందని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. మత మార్పిడులను అడ్డుకోవడానికే డిసెంబరు 25 క్రిస్మస్ రోజున గిరిజనులకు భగవద్గీతలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అరకు, ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లోని పాడువాలో ఆదివారం ఆయన సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గురుదేవా ఛారిటబుల్ ట్రస్టుతో కలిసి అటవీ పుత్రులకు విశాఖ శారదాపీఠం తరపున ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
భగవద్గీతలతో పాటు రగ్గులను పంపిణీ చేసి ఉచితంగా మందులను అందజేసారు. గిరిజనులతో రామనామ జపం చేయించారు. హిందూమతం వర్ధిల్లాలంటూ నినాదాలు వినిపించారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి గిరిజనులను ఉద్దేశించి మాట్లాడారు. గిరిజన ప్రాంతాలను కలుపుతూ జిల్లాలు ఏర్పాటు కావడం పట్ల ఆనందం వ్యక్తం చేసారు. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే గిరిజన జిల్లాలు ఏర్పాటయ్యాయయని తెలిపారు. ఇది గిరిజనులకు అదృష్టమేనని అన్నారు.
గిరిజన సంపద దోపిడీకి గురవుతోందని, అడ్డుకున్న ఆదివాసీలపై అక్రమ కేసులు బనాయించి జైళ్ళలో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. జైళ్ళలో మగ్గిపోతున్న ఆదివాసీలకు విముక్తి కలిగించేందుకు తక్షణం గిరిజన జిల్లాల్లో జిల్లా కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మైదాన ప్రాంత వాసుల దోపిడీని అరికట్టడానికి చట్టాల్లో మార్పులు తీసుకురావాలని అభిప్రాయపడ్డారు.
గతంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గళమెత్తిన ఏకైక పీఠం విశాఖ శారదాపీఠమని గుర్తు చేసారు. ఆదివాసీల కోసం పాడేరులో సూపర్ స్పెషాలిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది కూడా తామేనని తెలిపారు. ఆదివాసీలకు విశాఖ శారదాపీఠం ఎపుడూ అండగా ఉంటుందని హామీనిచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధులు సహకరిస్తే అరకులో పాఠశాల ఏర్పాటు చేయడానికి ముందుకొస్తామని అన్నారు.
వచ్చే ఏడాది పీఠంలో పెద్ద ఎత్తున యాగం తలపెడతామని, అందులో గిరిజనులను భాగస్వామ్యులను చేస్తామని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఆలయాల నిర్మాణం చేపట్టి ఇప్పటికే కొన్నింటిని గిరిజనులకు అంకితమిచ్చామని అన్నారు. ఐదేళ్ళ క్రితం 400 గోవులను గిరిజనులకు పంచిన ఘనత తమ పీఠానికి ఉందని చెప్పారు. ఆంజనేయుడు గిరిజనుడేనని, అడవి బిడ్డలంతా అంజనీపుత్రుని వారసులేనని తెలిపారు. ప
సుపు – కుంకుమలు వదలొద్దని, అన్యమతాల ఉచ్చులో పడొద్దని హితవు చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్న గురుదేవా ఛారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు జగదీష్బాబును అభినందించారు. అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ స్వరూపానందేంద్ర స్వామిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు