హైదరాబాద్ లోని రైల్వే స్టేషన్లకు ప్రత్యామ్నాయంగా గజ్వేల్ ను అభివృద్ధి పరచబోతున్నారు. గజ్వేల్ స్టేషన్ను విస్తరించి దిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, షిర్డీ, తిరుపతికి రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే శాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్ (నాంపల్లి), సికింద్రాబాద్, కాచిగూడా రైల్వే స్టేషన్లకు భారీగా రద్దీ పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటిని విస్తరించేందుకు వీలులేక పోవడంతో గజ్వేల్పై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్కు 50 కిలోమీటర్ల దూరంలో అవుటర్ రింగు రోడ్డుకు చేరువలో గజ్వేల్ ఉండటంతో ప్రయాణికులు హైదరాబాద్, సికింద్రాబాద్ స్టేషన్లకు వెళ్లకుండానే గజ్వేల్కు చేరుకుని వారి గమ్యస్థానాలకు చేరుకునేలా లైన్లు ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఎక్స్ప్రెస్ రైళ్లను నడిపే స్టేషన్లు విశాలంగా ఉండటంతో పాటు వివిధ సేవలు అందించేందుకు ఫ్లాట్ఫారాలు అవసరం ఉండనున్నాయి.
ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా గజ్వేల్ రైలు కోరిక కాగితాలకే పరిమితమైంది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేసి గెలుపొంది ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం గజ్వేల్ రైలు ప్రాజెక్టు పట్టాలెక్కింది. మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి వరకు దాదాపు 151 కిలోమీటర్ల పొడవుతో రూ.1160.47 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ రైల్వే ప్రాజెక్టును నాలుగు దశ(రీచ్)ల్లో నిర్మిస్తున్నారు. తొలి దశగా మనోహరాబాద్-గజ్వేల్ మధ్య 31 కిలోమీటర్ల మేర రైలు నడిపేందుకు సర్వం సిద్ధం చేశారు. తొలి విడత రైల్వే సేవలను హైదరాబాద్-కాచిగూడ-గజ్వేల్ మధ్య ప్రారంభిస్తారని సమాచారం. అనంతరం తిరుపతి, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలకు రైల్వే లింకు ఇచ్చే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.