కామారెడ్డి జిల్లాలో కరోనా వైరస్ మరోసారి పంజా విసిరింది. జిల్లాలో కరోనా కేసులు లేవని విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్న ప్రజల్లో ఒక్కసారిగా పాజిటివ్ కేసు భయాన్ని సృష్టించింది. పాజిటివ్ బాధితుడు ఎక్కడెక్కడ తిరిగాడో అంటూ వివరాలు సేకరిస్తున్నారు.
మరోవైపు బాధిత కుటుంబ సభ్యులను అధికారులు క్వారంటైన్లో ఉంచారు. జిల్లా కేంద్రంలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ కాలనీలో నివాసముండే 60 సంవత్సరాల వృద్ధుడికి జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలతో సదరు బాధితుడు పరీక్షలు చేసుకోవడానికి హైదరాబాద్ కింగ్ కోఠి ఆస్పత్రికి వెళ్ళాడు.
అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు పాజిటివ్ గా నిర్దారించారు. అయితే బాధితునికి విషయం చెప్పే లోపు ఆస్పత్రిలో కనిపించలేదు. దాంతో జిల్లా అధికారులకు సమాచారం అందించారు. రాత్రి కాసేపటి తర్వాత బాధితుడు మళ్ళీ ఆస్పత్రికి వచ్చాడు.
అయితే నిన్న రాత్రి మీడియా బులిటీన్ విడుదల తర్వాత పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని తెలిసింది. నేడు జిల్లా వైద్యాధికారులు పంచముఖి హనుమాన్ కాలనీలో బాధితుని ప్రైమరీ కాంటాక్టులపై విచారణ చేపట్టారు. ప్రస్తుతం అతని కుటుంబ సభ్యులు 13 మందిని హోం క్వారంటైన్ లో ఉంచారు.
హైదరాబాద్ వెళ్ళక ముందు కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నట్టు సమాచారం. బాధితుడు ఎంతమందిని కలిసాడు.. ఎక్కడెక్కడ పరీక్షలు చేసుకున్నాడనే విషయాలపై అధికారులు విచారణ చేపట్టారు. జిల్లాలో కరోనా కేసులు లేవని ధీమాగా తిరుగుతున్న వారి గుండెల్లో పాజిటివ్ కేసు పిడుగు పడినట్లయింది.