కరోనా ఉధృతి నేపధ్యంలో ప్రజల ప్రాణ రక్షణే ధ్యేయంగా విధి నిర్వహణలో ఉంటూ ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఘనంగా నివాళులర్పించారు.
కరోనాతో ప్రాణాలు కోల్పోయిన 10 మంది విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది, అధికారులు, హోంగార్డులను స్మరించుకుంటూ విజయవాడ నగర పోలీస్ శాఖ అశ్రునివాళి అర్పించడం జరిగింది.
పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో సీపి శ్రీనివాసులు పాల్గొని కరోనాకు గురై మృతి చెందిన అమర పోలీసు సిబ్బంది మరియు అధికారుల చిత్రపటాలకు పూలమాలలతో నివాళి అర్పించి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించడం జరిగింది.
అనంతరం వారి కుంటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం మరియు సానుభూతిని తెలియజేసి, మృతి చెందిన వారి కుటుంబాలకు భగవంతుడు మానసిక సైర్యం ఇవ్వాలని, శాఖాపరంగా వారి కుటుంబాలకు అండగా వుండి సహాయ సహకారాలు అందిస్తామని, ప్రభుత్వపరంగా రావాల్సిన ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ తెలిపారు.
సమాజంలో పోలీస్ ఉద్యోగానికి ఒక ప్రాధాన్యత ఉందని, సమాజ శ్రేయస్సు కోసం విపత్కర పరిస్థితులలో అవాంతరాలను ఎదుర్కొంటూ ఉద్యోగ బాద్యతలు చేయాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు.
ఈ క్రమంలో దాదాపు 15 నెలల నుండి కరోనాతో సహజీవనం చేయాల్సి వస్తుందని, కరోనా మొదటి దశలో సుమారు విజయవాడ నగరంలో పని చేస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు హోంగార్డులు కలసి 396 మంది కరోనా వ్యాధికి గురికాగా ఇద్దరు మాత్రమే మృత్యువాత పడ్డారని, కాని ఉదృతంగా వ్యాపించిన కరోనా రెండోవ దశలో కేవలం నెలన్నర రోజుల్లో 405 మంది పోలీసులు కరోనా బారినపడగా 8 మంది పోలీసులు మృతి చెందడం బాధాకర విషయమని సీపి విచారం వ్యక్తం చేశారు.
అనేక జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రజలు కరోనా నిబంధనలను పాటించే విషయంలో గాని, కర్ఫ్యూ మరియు ఎన్ఫోర్స్మెంట్ సందర్భంలో గాని నిరంతరం ప్రజలతో తస్సంబంధాలు కలిగి ఉద్యోగం నిర్వర్తించవలసిన సమయంలో పోలీసులు కూడా వ్యాధి బారినపడుతున్నారని, కాబట్టి ఉద్యోగం నిర్వహించే సమయంలో డబుల్ మాస్క్లు ధరించడం, చేతులకు శానిటైజర్లు, గ్లౌజులు ఉపయోగించడం, ఫేస్ షీల్డ్ ధరించడం, ఉద్యోగం చేసి ఇంటికి వెళ్లిన అనంతరం స్నానం చేయడం తదితర జాగ్రత్తలు పాటించాలన్నారు.
లా అండ్ ఆర్డర్-2 డి.సి.పి.లు విక్రాంత్ పాటిల్, వి.హర్షవర్ధనరావజు, అడ్మిన్ డీసీపి మేరీ ప్రశాంతి, టాస్క్ఫోర్స్ ఏడిసిపి కె.వి.శ్రీనివాసరావు, లా & ఆర్డర్-2 ఏ.డి.సి.పి. సి.హెచ్.లక్ష్మీపతి, క్రైమ్ ఏ.డి.సి.పి. యం.సుభాస్ చంద్రబోస్, ట్రాఫిక్ ఏడిసిపి టి.సర్కార్, స్పెషల్ బ్రాంచ్ ఏ.సి.పి. సి.హెచ్.రవికాంత్, హెడ్ క్వార్టర్ ఏ.సి.పి. చెంచిరెడ్డి, సి.ఎస్.డబ్ల్యూ ఏ.సి.పి. రంఘముని, సి.సి.ఆర్. బి. ఏ.సి.పి. కె.వెంకటేశ్వరరావు, విజయవాడ పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యం.సోమయ్య, ఇతర పోలీసు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొని మృతి చెందిన పోలీసు సోదరులకు నివాళి అర్పించారు.